అనంతపురం కల్చరల్ : హిందువులు ఏ కార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగాలంటే వినాయకుని అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలని భావిస్తుంటారు. గణపతి పూజ అనంతరం వివిధ పూజా కార్యక్రమాలను వేదపండితులు నిర్వహిస్తుంటారు. అమ్మచేతిలో పసుపు ముద్దగా అవతరించి పసుపు గణపతిగా పూజలు అందుకుంటున్న ఆదిదేవుడైన గణపతి ఆవిర్భవించిన రోజే నేడు మనం జరుపుకుంటున్న వినాయక చవితి. పండుగ కోసం పూజాసామగ్రి వినాయక ప్రతిమల కొనుగోళ్లతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనంతపురంతో పాటు మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాలు కిటకిటలాడాయి. మామిడాకులు, చెరకు గడలు, వెలగకాయలు, పండ్లు, పూలు కొనుగోలు చేశారు. వివిధ రూపాల్లోని బొజ్జ గణపయ్యలు అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, శింగనమల, రాప్తాడు నియోజకవర్గాల్లో ఏర్పాటైన మంటపాల్లో కొలువుదీరాయి. ఇక ఇంట్లో పూజించేందుకు మార్కెట్లో వివిధ పరిమాణాల్లో లభించే రకరకాల గణపతి ప్రతిమలను తీసుకొచ్చారు.
కదిలే వినాయకులు
ఏటేటా వినాయక సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కొలువుదీరిన వినాయకుల్లో కదిలే విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ విద్యుద్దీపకాంతులతో భారీ దేవతారూపాల సెట్టింగులతో సుందరంగా ముస్తాబైంది. మొదటిరోడ్డు, రాణీనగర్, కమలానగర్, ప్రకాష్రోడ్డు తదితర చోట్ల కదిలే వినాయకులు పుణ్యక్షేత్రాల వృత్తాంతాలను ప్రదర్శించడానికి సిద్ధ మయ్యాయి.
నేడు ప్రత్యేక పూజలు
వినాయక చవితి సందర్భంగా శనివారం అనంతపురంలోని పాతూరు చెరువుకట్ట వినాయక ఆలయం, రైల్వేస్టేషన్ సమీపంలోని విఘ్నేశ్వరాలయం, కమ్మభవన్ ఎదురుగా ఉన్న శ్రీసిద్ధి వినాయక ఆలయం తదితర చోట్ల ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరగనున్నాయి.
ఊరూవాడా చవితి సంబరం
వివిధ రూపాల్లో కొలువుదీరుతున్న గణనాథులు
పండుగ కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిట
Comments
Please login to add a commentAdd a comment