కాంక్రీట్‌ మిశ్రమ పరీక్షలు నేటితో పూర్తి | Concrete mix tests completed today | Sakshi
Sakshi News home page

కాంక్రీట్‌ మిశ్రమ పరీక్షలు నేటితో పూర్తి

Published Sun, Jan 5 2025 5:56 AM | Last Updated on Sun, Jan 5 2025 5:56 AM

Concrete mix tests completed today

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే మూడు పరీక్షలు 

నేడు నాలుగో పరీక్ష ఫలితంపై నివేదిక

సాక్షి, అమరావతి : అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఖరారు చేసే కాంక్రీట్‌ మిశ్రమం ఆధారంగా పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో వినియోగించే మూడు తరహాల కాంక్రీట్‌ సమ్మేళనాలపై ఐఐటీ(తిరుపతి) ప్రొఫెసర్లు పరీక్షలు చేశారు. ఆ పరీక్షల ఫలితాలను పోలవరం ప్రాజెక్టు అధికారుల ద్వారా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపారు. 

నాలుగో తరహా కాంక్రీట్‌ సమ్మేళనంపై నిర్వహించిన పరీక్ష ఫలితాలకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. దీనిని కూడా పోలవరం అధికారులు పీపీఏ, సీడబ్ల్యూసీకి పంపనున్నారు. నాలుగు తరహాల కాంక్రీట్‌ సమ్మేళనాలపై నిర్వహించిన పరీక్షల ఫలితాలపై సోమవారం తర్వాత అంతర్జాతీయ నిపుణుల కమిటీ సభ్యుల అందుబాటును బట్టి..  సీడబ్ల్యూసీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. 

ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అధికారులతోపాటు పీపీఏ, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌(సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటరీయల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌), వ్యాప్కోస్‌ అధికారులు పాల్గొననున్నారు. గ్యాప్‌–2లో కొత్తగా నిర్మించే డయాఫ్రం వాల్‌ డిజైన్‌ను ఇప్పటికే సీడబ్ల్యూసీ సూత్రప్రాయంగా ఆమోదించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఖరారు చేసే కాంక్రీట్‌ మిశ్రమం ఆధారంగా డయాఫ్రం వాల్‌ డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఖరారు చేయనుంది. ఆ తర్వాత డయాఫ్రం వాల్‌ పనులను కాంట్రాక్టు సంస్థ చేపట్టనుంది. 

పోలవరం ప్రాజెక్టు వద్ద నవంబర్‌ 6–10 మధ్య వర్క్‌ షాప్‌ నిర్వహించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ.. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో వినియోగించాల్సిన కాంక్రీట్‌ మిశ్రమాలపై పరీక్షలు చేయాలని సూచించింది. టీ–10 తరహా కాంక్రీట్‌ సమ్మేళనం ఆధారంగా రూపొందించిన మిశ్రమం పటిష్టతపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీ–11, టీ–12 తరహా కాంక్రీట్‌ సమ్మేళనాల ఆధారంగా రూపొందించిన నాలుగు రకాల కాంక్రీట్‌ మిశ్రమాల పటిష్టతపై 14 రోజుల పరీక్ష చేసి, నివేదిక ఇవ్వాలని సూచించింది. 

ఈ పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఐఐటీ (తిరుపతి) ప్రొఫెసర్లకు సీడబ్ల్యూసీ అప్పగించింది. టీ–11, టీ–12 కాంక్రీట్‌ సమ్మేళనాల ఆధారంగా రూపొందించిన మూడు రకాల మిశ్రమాన్ని ట్యూబ్‌లలో పోసి.. 14 రోజుల తర్వాత ఐఐటీ ప్రొఫెసర్లు పరీక్షలు చేసి, వాటి ఫలితాలపై ఇప్పటికే నివేదిక ఇచ్చారు. నాలుగో తరహా కాంక్రీట్‌ మిశ్రమంపై 14 రోజుల పరీక్ష ఆదివారంతో పూర్తి కానుంది. 

కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం ఇలా..
n ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో 89.09 మీటర్ల నుంచి 1,485.69 మీటర్ల మధ్య 1,396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు.. కనిష్టంగా 6 మీటర్లు, గరిష్టంగా 93.5 మీటర్ల లోతున ప్లాస్టిక్‌ కాంక్రీట్‌తో కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించాలి.
n కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం కోసం గైడ్‌ వాల్స్‌పై ఏర్పాటు చేసే ప్లాట్‌ఫామ్‌ మీద నుంచి గ్రాబర్లు, కట్టర్లతో రాతి పొర తగిలే వరకు భూగర్భాన్ని తవ్వుతూ ప్యానళ్లను దించుతూపోతారు. 

తవ్వి తీసిన మట్టి స్థానంలో బెంటనైట్‌ మిశ్రమాన్ని నింపుతారు. రాతి పొర తగిలాక... అధిక ఒత్తిడితో కాంక్రీట్‌ మిశ్రమాన్ని పంపుతారు. అప్పుడు బెంటనైట్‌ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్‌ మిశ్రమంతో కొంత బెంటనైట్‌ మిశ్రమం కలిసి ప్లాస్టిక్‌ కాంక్రీట్‌గా మారి గోడలా తయారవుతుంది.  

n్ఙ్ఙడయాఫ్రం వాల్‌కు లీకేజీ (సీపేజీ) ఫర్మియబులిటీ (తీవ్రత) ఒక లీజీయన్‌ లోపు ఉండాలి.  ప్రధాన గ్యాప్‌–1లో గత ప్రభుత్వం నిర్మించిన డయా ఫ్రం వాల్‌లో లీకేజీ ఫర్మియబులిటీ ఒక లీజీయన్‌ లోపే ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement