
సాక్షి, వైఎస్సార్ జిల్లా : సంక్షేమ పథకాల ప్రదాత, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ప్రకటించాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు డిమాండ్ చేశారు. పేదలకు అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు వైఎస్సార్.. భారతరత్నకు అన్ని రకాల అర్హుడన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజలకు మేలు చేసిన నాయకుల్లో మహనేత మొదటి స్థానంలో నిలుస్తారని, దేశవ్యాప్తంగా సర్వేలు చేసి మహనేతకు భారతరత్న ఇవ్వాలన్నారు. పేదలకు దేవుడిలాగా అండగా నిలిచిన అపరభగీరధుడు మహనేత వైఎస్సార్ అంటూ కొనియాడారు. బుధవారం మహానేత 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి, విగ్రహానికి, వైఎస్సార్ సర్కిల్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు నివాళులర్పించారు. ( అదే స్ఫూర్తి.. అదే లక్ష్యం.. అదే గమ్యం )
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, ఆభిమానులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి, జకీయా ఖానంలు మాట్లాడుతూ..‘‘ ప్రతి ఒక్కరు స్మరించుకుంటున్న మహానాయకుడు వైఎస్సార్. సంక్షేమానికి పెట్టిన పేరు వైఎస్సార్. రైతులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల, మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచించి ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన నాయకుడు వైఎస్సార్. మహనేత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తండ్రి తరహాలోనే తనయుడి పాలన కొనసాగుతోంది. తండ్రి అకాల మరణం తర్వాత తనయుడు ఏపీ ప్రజల సంక్షేమం తన భుజాల మీద వేసుకుని పాలన కొనసాగిస్తున్నారు. ఆయన బాటలో మేము నడవడం గర్వంగా భావిస్తున్నా’’మన్నారు.