![మేనరిక వివాహాలపై అవగాహన అవసరం](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/26/25gwe06-150205_mr.jpg.webp?itok=WIdBmiGT)
నగరంపాలెం: మేనరిక వివాహాలతో పుట్టే పిల్లలు వైకల్యంతో జన్మిస్తున్నారని వికలాంగుల సంక్షేమం, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ సువార్త అన్నారు. కేంద్ర, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ తప్పిపోయిన బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. సంస్థ జిల్లా కార్యదర్శి టి.లీలావతి అధ్య్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏడీ సువార్త మాట్లాడుతూ మేనరికం వివాహాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ట్రాన్స్జెండర్స్ తమ గుర్తింపు, ఆధార్, రేషన్ కార్డులు పొందవచ్చని చెప్పారు. ప్రతినెల పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవీ మాట్లాడుతూ బాల్య వివాహాలపై అవగాహన ఉండాలని అన్నారు. బస్సుల్లో, రైళ్లల్లో చిన్నారులను అపహరించి, వారితో చోరీలు చేయిస్తున్నారని, వాటిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ప్రమీల మాట్లాడుతూ తప్పిపోయిన పిల్లలను సాంకేతిక పరిజ్ఞానంతో వెంటనే గుర్తించే అవకాశం ఉందని అన్నారు. జిల్లా రక్షణ అధికారి విజయ్కుమార్, జిల్లా యాంటీ ట్రాపికింగ్ యూనిట్ అధికారిణి బేబీరాణిలు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని అన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మత్తు పదార్ధాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. వివిధ నేరాల్లో బాధితులకు ప్రభుత్వం అందించే సహాయం, బాల నేరస్తుల చట్టం, సీనియర్ సిటిజెన్/బాల కార్మికుల హక్కులు, బాల్య వివాహాలు, బాలల హక్కులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి వివరించారు. సదస్సులో క్రాఫ్ట్ జిల్లా సమన్వయకర్త సమీర్, కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ లక్ష్మయ్య, ప్రభుత్వ అధికారులు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్స్ పాల్గొన్నారు.