సొంత భవనంలోకి కేంద్రియ విద్యాలయం | Sakshi
Sakshi News home page

సొంత భవనంలోకి కేంద్రియ విద్యాలయం

Published Sun, May 26 2024 7:00 AM

సొంత

● ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం ● ఇర్లపాడు వద్ద తుది దశకు నిర్మాణ పనులు

నాదెండ్ల: చిలకలూరిపేట విద్యారంగంలో మణిహారమైన కేంద్రియ విద్యాలయం 2024 విద్యా సంవత్సరానికి సొంత భవనంలో ప్రారంభానికి సిద్ధమౌతోంది. మండలంలోని ఇర్లపాడులో సుమారు రూ.19.8 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. విద్యాలయం పనులు తుది దశకు చేరాయి. ఈ విద్యాసంవత్సరం నుండే విద్యాలయం ప్రారంభం కానుంది.

2018లో ఈ పాఠశాలకు అనుమతులు రాగా, 2019 నుంచి గణపవరంలోని సీఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల భవనాల్లో తాత్కాలికంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ ఇక్కడ తరగతులు నిర్వహించనున్నారు. నాణ్యమైన ఒత్తిడి లేని విద్యకు ఈ పాఠశాల మారుపేరుగా ఉంది. ఈ పాఠశాలలో సీటు రావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఆపై ఖాళీల్లో రిజర్వేషన్‌ వారీగా కేటాయింపులు చేస్తారు.

9.61 ఎకరాల విస్తీర్ణంలో...

కేంద్రియ విద్యాలయానికి అనుమతులు రావాలంటే కనీసం పదెకరాలు స్థలం ఉండి తీరాలి. అప్పట్లో నాదెండ్ల రెవెన్యూ అధికారులు ఇర్లపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో 10.10 ఎకరాల విస్తీర్ణాన్ని అప్పగించారు. సుమారు 50 సెంట్ల విస్తీర్ణంలో పక్కనే ఉన్న జగనన్న కాలనీకి అవసరమైన రోడ్లకు వదిలారు. ప్రస్తుతం 9.61 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

రూ.19.8 కోట్ల వ్యయంతో...

విద్యాలయంలో తరగతి గదులు, ల్యాబ్‌, లైబ్రరీ, ఉపాధ్యాయులకు అవసరమైన స్టాఫ్‌ రూమ్‌లతోపాటూ సిబ్బందికి అవసరమైన క్వార్టర్స్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. తిరుపతికి చెందిన సీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వారు నిర్మాణ పనులు జరుపుతున్నారు. సీపీడబ్ల్యూడీ విజయవాడ డివిజన్‌ అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గణపవరంలోని సీఆర్‌ కళాశాలలో విద్యాలయం తాత్కాలికంగా నడుస్తుండగా, 9వ తరగతి వరకూ విద్యాభ్యాసం కొనసాగుతోంది. 2024 విద్యాసంవత్సరంలో పదో తరగతి బ్యాచ్‌ ప్రారంభం కానుంది. 2025 నుండి ఇంటర్‌ మొదటి సంవత్సరం, ఆ తర్వాత ఏడాది ఇంటర్‌ రెండో సంవత్సరం బ్యాచ్‌ ప్రారంభం కానుంది. వీటికి సంబంధించి కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

నాణ్యమైన ఒత్తిడి లేని విద్య

నాణ్యమైన ఒత్తిడి లేని విద్యతోపాటూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రియ విద్యాలయం పెట్టింది పేరు. విద్యార్థుల అభ్యున్నతికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తాం. ప్రస్తుతం గణపవరంలో తాత్కాలిక భవనాల్లో నడుస్తున్న విద్యాలయంలో 2024 విద్యా సంవత్సరంలో నూతన భవనాల్లో ప్రారంభం కానుంది.

– సునీతసింగ్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌

సొంత భవనంలోకి కేంద్రియ విద్యాలయం
1/1

సొంత భవనంలోకి కేంద్రియ విద్యాలయం

Advertisement
 
Advertisement
 
Advertisement