
జియో, వొడాఐడియాలకు ఎయిర్టెల్ లేఖ
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న టెలికం మోసాలు, స్కామ్లకు వ్యతిరేకంగా కలసికట్టుగా పోరాడుదామంటూ రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థలను ఎయిర్టెల్ కోరింది. సున్నితమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న టెలికం మోసాలకు వ్యతిరేకంగా పరిశ్రమ అంతా ఒక్కటై సమష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వానికి, ట్రాయ్కి ఎయిర్టెల్ లేఖ రాసింది.
2024 మొదటి తొమ్మిది నెలల్లో రూ.11,000 కోట్లకుపైగా ఆర్థిక నష్టంతో కూడిన 17 లక్షల సైబర్ నేరాలపై ఫిర్యాదులు నమోదు కావడాన్ని తోటి టెలికం కంపెనీల దృష్టికి తీసుకెళ్లింది. ఫోన్కాల్స్ ద్వారా ఓటీపీలు తెలుసుకోవడం, ఫిషింగ్ లింక్లు పంపడం ద్వారా డేటా చోరీ తదితర నేరాలు పెరిగిపోతున్న తరుణంలో ఎయిర్టెల్ చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. స్పామ్లు, మోసాలను గుర్తించే సొల్యూషన్లను ఎయిర్టెల్ కొన్ని వారాల నుంచి తన నెట్వర్క్ పరిధిలో అమలు చేస్తుండడం గమనార్హం.
‘‘ఫిషింగ్ దాడులు, హానికారక యూఆర్ఎల్ ఆధారిత స్కామ్లు ఇటీవలి కాలంలో ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయిన నేపథ్యంలో.. పరిశ్రమ వ్యాప్తంగా మరింత సమన్వయంతో కూడిన చర్యలు అవసరం. టెలికం సేవల ప్రొవైడర్ల మధ్య సమన్వయ లోపాలను ఈ తరహా అత్యాధునిక మోసపూరిత పథకాలు ఉపయోగించుకుంటాయి’’అని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లహోటి, టెలికం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్కు రాసిన లేఖలో ఎయిర్టెల్ పేర్కొంది. ఉమ్మడి చర్యల దిశగా టెలికం సరీ్వస్ ప్రొవైడర్లను (జియో, వొడాఐడియా) ఈ నెల 14న సంప్రదించినట్టు తెలిపింది. అన్ని కంపెనీలు రియల్ టైమ్ ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ పంచుకోవడం, నెట్వర్క్ల మధ్య సమన్వయంతో మోసాలను గుర్తించి, నిరోధించేందుకు ఈ చర్య చేపట్టినట్టు వివరించింది.