Iran-Israel Tensions: మార్కెట్లకు యుద్ధ భయం | Sakshi
Sakshi News home page

Iran-Israel Tensions: మార్కెట్లకు యుద్ధ భయం

Published Tue, Apr 16 2024 5:43 AM

Iran-Israel Tensions: Indian Indices crack amid West Asia crisis - Sakshi

ఇరాన్‌ – ఇజ్రాయిల్‌ ఉద్రిక్తతల షాక్‌  

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతలు

సెన్సెక్స్‌ 845 పాయింట్ల పతనం

22,300 దిగువకు నిఫ్టీ

రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి  

ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్‌ సూచీలు సోమవారం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల అనిశ్చితి, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, మార్చిలో టోకు ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్టానికి చేరుకోవడం తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం సెన్సెక్స్‌ 930 పాయింట్ల 73,315 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు క్షీణించి 22,339 వద్ద మొదలయ్యాయి.

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్‌ 845 పాయింట్లు పతనమై 2 వారాల కనిష్టం దిగువున 73,400 వద్ద నిలిచింది. నిఫ్టీ 247 పాయింట్లు క్షీణించి 22,272 వద్ద స్థిరపడింది. ఒక్క ఆయిల్‌అండ్‌గ్యాస్‌ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

ఫైనాన్సియల్‌ సరీ్వసెస్, సరీ్వసెస్, ఐటీ, బ్యాంకింగ్‌ ఇండెక్సులు మెటల్, ఆటో షేర్లు భారీ నష్టాలు చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,288 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,763 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో ఒక్క చైనా(1%) మినహా అన్ని దేశాల సూచీలు దాదాపు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో యూరప్‌ మార్కెట్లు కోలుకున్నాయి.

► సెన్సెక్స్‌ 845 పాయింట్ల పతనంతో బీఎస్‌ఈలో రూ.5.18 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.394 లక్షల కోట్లకు దిగివచి్చంది. కాగా ఈ సూచీలో 30 షేర్లకు గానూ మారుతీ సుజుకీ (1%), నెస్లే (0.62%), సన్‌ఫార్మా(0.10%) మాత్రమే లాభపడ్డాయి.  
► ఐటీ దిగ్గజం టీసీఎస్‌ షేరు ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.3942 వద్ద నిలిచింది. క్యూ4 ఫలితాలు మెప్పించడంతో ట్రేడింగ్‌ ప్రారంభంలో 1.50% పెరిగి రూ.4063 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అయితే నష్టాల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా ఈ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.  
► అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ ఆయిల్‌అండ్‌గ్యాస్‌ కంపెనీల షేర్లకు కలిసొచి్చంది. ఓఎన్‌జీసీ 6%, ఐజీఎల్‌ 2%, ఐఓఎల్, గెయిల్‌ 1.50% చొప్పున లాభపడ్డాయి. జీఎస్‌పీఎల్‌ 1% లాభపడ్డాయి.
► ప్రతి ఈక్విటీ షేరుకు రూ.118 ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు ఆమోదించడంతో ఆస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ షేరు 7% లాభపడి రూ.523 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.558 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది.

Advertisement
Advertisement