అలా చేస్తే ప్రజల్లో విశ్వసనీయత పోతుంది | Rajan Cautions Against Excluding Food Inflation | Sakshi
Sakshi News home page

అలా చేస్తే ప్రజల్లో విశ్వసనీయత పోతుంది

Published Sun, Oct 6 2024 4:08 AM | Last Updated on Sun, Oct 6 2024 4:08 AM

Rajan Cautions Against Excluding Food Inflation

ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాల్సిందే 

ద్రవ్యోల్బణంపై మాజీ గవర్నర్‌ రాజన్‌ స్పందన

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం నుంచి ఆహారోత్పత్తుల ధరలను మినహాయించడానికి తాను వ్యతిరేకమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్పష్టం చేశారు. సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల సవరణలో ఆహార ధరలను మినహాయించాలన్న సూచనలపై రాజన్‌ స్పందించారు. అలా చేస్తే సెంట్రల్‌ బ్యాంక్‌ పట్ల ప్రజల్లో ఉన్న గొప్ప నమ్మకం తుడిచిపెట్టుకుపోతుందన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో పెట్టాలంటూ ఆర్‌బీఐకి కేంద్రం లక్ష్యం విధించడాన్ని గుర్తు చేశారు. వినియోగదారులు వినియోగించే ఉత్పత్తుల బాస్కెట్‌ వరకే ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యం ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఎందుకంటే అది వినియోగదారుల అవగాహనను ప్రభావితం చేస్తుందన్నారు. రాజన్‌ ఓ వార్తా సంస్థకు ఇచి్చన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయమై మాట్లాడారు. వడ్డీ రేట్ల నిర్ణయంలో రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని మినహాయించాలని 2023–24 ఆర్థిక సర్వేలో పేర్కొనడం గమనార్హం. ‘‘ద్రవ్యోల్బణంలో ఎంతో ముఖ్యమైన కొన్నింటిని మినహాయించి, ద్రవ్యోల్బణం నియంత్రణంలో ఉందని చెప్పొచ్చు. కానీ, ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అలాంటప్పుడు దీన్ని ద్రవ్యోల్బణం బాస్కెట్‌లో చేర్చకపోతే ఆర్‌బీఐ పట్ల ప్రజల్లో గొప్ప విశ్వాసం నిలిచి ఉండదు’’అని రాజన్‌ వివరించారు.  

ఇలా చేయాలి.. 
‘‘ఆహార ధరలు దీర్ఘకాలం పాటు అధిక స్థాయిల్లోనే కొనసాగుతున్నాయంటే, డిమాండ్‌కు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయడంలో ఉన్న సమస్యలను తెలియజేస్తోంది. అలాంటి సందర్భంలో ఇతర విభాగాల్లోని ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి. సెంట్రల్‌ బ్యాంక్‌ చేయాల్సింది ఇదే’’అని రఘురామ్‌ రాజన్‌ అభిప్రాయపడ్డారు. మొత్తం ధరలను ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో ఆహారం వెయిటేజీ ప్రస్తుతం 46 శాతంగా ఉంది. దీన్ని 2011–12లో నిర్ణయించారు. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం విధించిన లక్ష్యం. ప్రతికూల పరిస్థితుల్లో ఇది మరో 2 శాతం ఎగువ, దిగువకు మించకుండా చూడాలి.  

విశ్వసనీయంగా ఉండాలి.. 
సెబీ చైర్‌పర్సన్‌ మాధవి పురి బుచ్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ చేసిన ప్రయోజన వైరు« ద్య ఆరోపణలను ప్ర స్తావించగా.. ఎవరైనా, ఎప్పుడైన ఆరోపణలు చేయొచ్చంటూ, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని రాజన్‌ పేర్కొన్నారు. ఒక్కో ఆరోపణపై మరింత వివరంగా స్పందన ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘అంతిమంగా మన నియంత్రణ సంస్థలు సాధ్యమైనంత వరకు విశ్వసనీయంగా మసలుకుంటే అది దేశానికి, మార్కెట్లకు మంచి చేస్తుంది. నియంత్రణ సంస్థలకూ మంచి చేస్తుంది’’అని రాజన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement