చిత్తూరు కలెక్టరేట్ : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు మద్యం, నగదు పంపిణీ చేయకుండా పర్యవేక్షణ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అబ్జర్వర్ల సమక్షంలో వరుస సమావేశాలు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోలింగ్కు సమయం దగ్గర పడుతోందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ రోజున ఏజెంట్ల సమక్షంలో మాక్పోలింగ్ నిర్వహించాలన్నారు. పోలింగ్ సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని చెప్పారు. రిసెప్షన్ కౌంటర్లో చెక్లిస్ట్ మేరకు పోలింగ్కు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయాలన్నారు. ఈ నెల 11వ తేదీన వెబ్ కెమెరాల నిర్వహణపై బీఎల్ఓలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలొస్తే టెక్నిషియన్లు వెంటనే స్పందించేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అబ్జర్వర్ షాదిక్ అలం మాట్లాడుతూ పోలింగ్ రోజున ప్రతి నియోజకవర్గంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షించాలన్నారు. పోలీస్ అబ్జర్వర్ అరవింద సాల్వే మాట్లాడుతూ సమస్యాత్మక కేంద్రాలలో శాంతిభద్రతలకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. వ్యయ అబ్జర్వర్ రోహన్ ఠాగూర్ మాట్లాడుతూ సరిహద్దు చెక్పోస్టుల వద్ద పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. సమావేశంలో చిత్తూరు అసెంబ్లీ ఆర్ఓ శ్రీనివాసులు, ఇతర నియోజకవర్గాల ఆర్ఓలు మనోజ్రెడ్డి, శ్రీనివాసులు, వెంకటశివ, చిన్నయ్య, వెంకటరెడ్డి, మధుసూదనరెడ్డి పాల్గొన్నారు.
10వ తేదీకి పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు
జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 10వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేసి సెక్టోరల్ అధికారులకు అప్పగించాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు పక్కాగా ఉండాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, డీఈఓ దేవరాజు పాల్గొన్నారు.