మధురపూడి: ఎన్నికల ప్రచారం నిమిత్తం భారత ప్రధాని నరేంద్రమోదీ సోమవారం రాజమహేంద్రవరం వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన మధురపూడి విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి చాపర్లో వేమగిరి వెళ్తారు. అక్కడ నిర్వహించే విపక్ష కూటమి ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వెళ్తారు.
బీజేపీ మూడోసారి
అధికారంలోకి వస్తే ప్రమాదం
రాజమహేంద్రవరం సిటీ: బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ప్రమాదమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని బీజేపీ దెబ్బ తీస్తోందని, రిజర్వేషన్లు ఎత్తేయాలని చూస్తోందని ఆరోపించారు. వివిధ మతాలు, వర్గాలు, కులాలు ఉన్న ఈ దేశం సెక్యులర్ విధానంలో నడుస్తూంటే, ఆ స్ఫూర్తిని దెబ్బ తీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ఈ పదేళ్లలో బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని, కానీ, 7,31,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి యువతను మోసగించిందని ఆరోపించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు, నాయకులు పాల్గొన్నారు.