ఏలూరు టౌన్: ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి కుట్రలను, అసత్య ప్రచారాలను వైఎస్సార్సీపీ నేతలు, క్యాడర్ తిప్పికొట్టాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు పార్టీ నేతలు, క్యాడర్ సైనికుల్లా పనిచేయాలని ఏలూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. ఏలూరు శ్రీరామ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం 41వ డివిజన్ కార్పొరేటర్ ఈదుపల్లి కల్యాణిదేవి, పార్టీ నాయకులు పవన్కుమార్, పసుపులేటి శేషు, ఎండీ మొహిద్దీన్ ఆధ్వర్యంలో 100 మంది టీడీపీ, జనసేన పార్టీల నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే నాని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. ఏలూరులో వేలాది మంది పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తే నేడు టీడీపీ మోసపు హామీలను ఇస్తూ ప్రలోభాలకు గురిచేస్తోందని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏలూరు కో–ఆప్షన్ సభ్యులు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్బాబు, కో–ఆప్షన్ సభ్యులు మున్నుల జాన్గురునాథ్ ఉన్నారు.
టీడీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు
నూజివీడు : చంద్రబాబు బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడే సత్తా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని, రాబోయే రోజుల్లో ప్రజలంతా వైఎస్సార్ సీపీకి ఓటేసి జగన్ను మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తనయుడు మేకా వేణుగోపాల అప్పారావు (చంటినాయన) అన్నారు. ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన యాదవులు, ఎస్సీలు కలిపి 50 కుటుంబాలు శనివారం అర్ధరాత్రి చంటినాయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో ఉల్లాస వెంకటేశ్వరరావు, ఉల్లాస మల్లికార్జునరావు, సాయిల సుబ్బారావు, సాయిల సన్యాసరావు, సాయిల రాజేశ్వరరావు, పటాపంచల కుమార్రాజా, కావటి సుబ్బారావు, ఏ అశోకకుమార్, ఏ పురుషోత్తం, డీ నానీ, ఏ భారతి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా చంటినాయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకు, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్కుమార్ యాదవ్లకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా దుర్గాభవాని, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు మూల్పూరి నాగవల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ కోటగిరి రాజానాయన, నాయకులు కొండా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
మీర్జాపురంలో..
నూజివీడు మండలం మీర్జాపురంలో టీడీపీకి చెందిన సయ్యద్ బాషా, రాజులపాటి శేషారావు, షేక్ బుజ్జీ, షేక్ బాజీ, షేక్ మీరాసాహెబ్, షేక్ అమీర్బాషా, షేక్ మీరావలీ, షేక్ రహమతుల్లాలు ఆదివారం చంటినాయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందరూ పార్టీ అభ్యర్థుల గెలుపుకు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నాయకులు జోగి ప్రభాకర్రావు, ఆరేపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.