మాచారెడ్డి/రామారెడ్డి: మాచారెడ్డి, రామారెడ్డి మండలాలలో శుక్రవారం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. సోమారంపేట, అంకిరెడ్డిపల్లి తండా, వెనుక తండా, అన్నారం తదితర గ్రామాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు మరింత నష్టపోయారు. మామిడి కాయలు నేలరాలాయి. సోమారంపేటలో ఒక ఇల్లు, అంకిరెడ్డిపల్లి తండాలో ఆరు ఇళ్ల రేకులు, అన్నారంలో ఓ ఇంటి రేకులు కొట్టుకుపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సోమారంపేటలో బూక్యా రవి అనే రైతు తన ట్రాక్టర్ను మామిడి చెట్టు కింద నిలపగా.. చెట్టు కూలడంతో ట్రాక్టర్ ధ్వంసమైంది.
తడిసిన ధాన్యం
నేలకూలిన చెట్లు,
విరిగిన విద్యుత్ సంభాలు
కొట్టుకుపోయిన రేకులు