కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ అనుమతి గల అధీకృత డీలర్ వద్దనే విత్తనాలు కొనాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస్ తెలిపారు. కొత్తపల్లి మండలం చింతకుంటలోని రైతు సంఘం సమావేశ మందిరంలో శనివారం విత్తనాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాలు కొన్న సమయంలో బిల్లులు తీసుకోవాలని సూచించారు. బిల్లుపై కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నంబర్, లాట్ నంబర్, ధర ఉండేలా చూసుకోవాలన్నారు. విత్తన ప్యాకెట్పై తయారైన తేదీ, ఎక్స్పైరీ తేదీలను సరిచూసుకోవాలని సూచించారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి విత్తనాలు విక్రయిస్తే వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చింతకుంట రైతు సంఘం అధ్యక్షుడు ఎన్.శంకరయ్య, ఏఈవో రాము, రైతులు పాల్గొన్నారు.
ఇయ్యాల నగరంలో పవర్ కట్
కొత్తపల్లి: విద్యుత్ లైన్ల నిర్వహణ, తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ చౌక్ ఫీడర్ పరిధిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కశ్మీర్గడ్డ, ముకరంపుర ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.సుధీర్ కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీనివాస థియేటర్, షాషామహల్, పద్మశాలీ స్ట్రీట్, మధుగార్డెన్, ఆటోనగర్, కేబుల్ బ్రిడ్జి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని టౌన్–1 ఏడీఈ నరేందర్ వివరించారు.