బనశంకరి: సైబర్ కేటుగాళ్ల గాలానికి చిక్కి ఓ పారిశ్రామికవేత్త కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. షేర్ల కొనుగోలు, విక్రయాలు గురించి శిక్షణతో పాటు టిప్స్ ఇస్తామని ఫేస్బుక్లో వచ్చిన ప్రకటనను చూసి బెంగళూరులోని జేపీ.నగర పారిశ్రామికవేత్త శివన్గుప్తా లింక్పై క్లిక్ చేయగానే వాట్సాప్లో గ్రూప్లో చేరిపోయాడు. గుర్తుతెలియని వ్యక్తులు మరో లింక్ పంపించి ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో అతను జీఎస్ఐడబ్ల్యూఎం అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. అనంతరం గుర్తుతెలియని వ్యక్తి షేర్లను విక్రయించడం, కొనుగోలు చేయడంపై కొంత సమాచారం అందించి పెట్టుబడి పెట్టాలని సలహా ఇచ్చారు. వంచకుల మాటలు నమ్మిన పారిశ్రామికవేత్త యాప్ ద్వారా రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. మళ్లీ రూ.42 లక్షలు , రూ.95 లక్షలు మొత్తం రూ. 2.27 కోట్ల మేర పెట్టుబడిపెట్టారు. లాభం వచ్చిందని చెప్పి రూ.57 లక్షలు పారిశ్రామికవేత్త అకౌంట్కు జమచేశారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి డబ్బును డ్రా చేసేందుకు యత్నించగా సాధ్యం కాలేదు. మరింత డబ్బు పెట్టుబడిపెడితే లాభం డ్రా యడానికి సాద్యమవుతుందని వంచకులు పక్కదారి పట్టించారు. వంచనకు గురైనట్లు గుర్తించిన పారిశ్రామికవేత్త దక్షిణ విభాగ సీఈఎన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.1.69 కోట్లు మోసపోయినట్లు వివరించాడు.
సుబ్రహ్మణ్యపుర నివాసికి
రూ.57 లక్షలు వంచన...
సుబ్రహ్మణ్యపుర గుబ్బిలాళకు చెందిన వ్యక్తిని వంచకులు వీ–ప్రో అనే ట్రేడింగ్ యాప్లో చేర్చారు. అతని వద్దనుంచి రూ.57లక్షలు వివిధ బ్యాంకు ఖాతాలకు జమ చేయించారు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రూ.35 లక్షలు టోకరా
జయనగర మూడోబ్లాక్కు చెందిన గృహిణికి ఇదే తరహాలో సైబర్కేటుగాళ్లు నమ్మించి రూ.35.12 లక్షలు వంచనకు పాల్పడ్డారు. ఇన్స్ట్రాగామ్లో ట్రేడింగ్ గురించి వచ్చిన ప్రకటనకు సంబంధించిన లింక్పై క్లిక్ చేయగా వాట్సాప్ గ్రూపులో చేర్చారు. వీక్గి అనే యాప్ను పంపించి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. తక్కువ సమయంలో అధిక కమీషన్ వస్తుందని ఆశపెట్టి దశలవారీగా రూ.45.40 లక్షలు పెట్టుబడి పెట్టించుకున్నారు. లాభం గురించి ఆరా తీయగా రూ.10.28 లక్షలు పంపారు. అయితే మరింత పెట్టుబడి పెట్టాలని చెప్పారు. దీంతో మొత్తం నగదును డ్రా చేసేందుకు యత్నించగా సాధ్యం కాలేదు. రూ.35.12 లక్షలు మోసపోయినట్లు బాధితురాలు దక్షిణ విభాగ సీఈఎన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
షేర్ల ట్రేడింగ్ పేరిట పంజా
విసిరిన సైబర్ కేటుగాళ్లు
రూ.1.69 కోట్లు మోసపోయిన
పారిశ్రామికవేత్త
మహిళను వంచించి రూ.57లక్షలు
రూ.35 లక్షలు పోగొట్టుకున్న గృహిణి