మైసూరు: జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మైసూరు జిల్లా, నంజనగూడు తాలూకా హులహళ్లి రామపుర వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇదే తాలూకా కెంబాలు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్రంగస్వామి(37) మృతి చెందాడు. ఇతను కిరాణా సరుకులు కొనుగోలు చేసేందుకు బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఘటనపై హలహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా నంజనగూడు పట్టణంలోని హోసరైల్వే వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన రాజముని వర్మ(30) అనే కార్మికుడు మృతి చెందాడు. ఇతను నంజనగూడు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హిందూస్థాన్ ఫుడ్స్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. నంజనగూడులో నివాసం ఉంటున్నాడు. ఏదో పని కోసం బైక్పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఎమ్మెల్యే కరగ పూజలు
కృష్ణరాజపురం: బెంగళూరు మహదేవపుర నియోజకవర్గంలోని చన్నసంద్రలో శ్రీ ద్రౌపదాంబ ధర్మరాయ స్వామి కరగ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మంజుల అరవింద లింబావలి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కన్నడనాడులో మంచి వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని పూజలు చేసినట్లు చెప్పారు.
కేంద్ర హోంమంత్రికి స్వాగతం
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగారు. ఎమ్మెల్యేలు మంజుల, రఘు ఆయనకు స్వాగతం పలికారు.
ఆస్తి పంచివ్వలేదని వ్యక్తి ఆత్మహత్య
మైసూరు: ఆస్తి ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల పట్టణం లింగాణాపురలో చోటు చేసుకుంది. కోళ్లెగాల తాలూకా మదువనహళ్లి గ్రామానికి చెందిన సునిల్ కుమార్ (32) తన కుటుంబంతో కలిసి లింగణపురర లేఔట్లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఆస్తి పంచి ఇవ్వడం లేదని మనోవేదనకు గురయ్యాడు. దీంతో భార్య, పిల్లలు బయటకు వెళ్లిన సమయంలో ఆదివారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొళ్లెగాల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.