సాక్షి,బళ్లారి: ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరమని, నేటి రోజుల్లో ప్రతి ఏటా పేదలకు ఉచిత సామూహిక సేవలు చేస్తున్న బసవరాజు స్వామి సేవలు హర్షణీయమని శ్రీమద్ ఉజ్జయిని సద్దర్మ సింహాసనాధీశ్వర శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు సిద్దలింగ రాజదేశీకేంద్ర శివాచార్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన నగరంలోకి మోకా రోడ్డులోని అటల్ బిహారి వాజ్పాయి కాలనీలో జే.ఎం.బసవరాజు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 10 సంవత్సరాలుగా పేదలకు ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతంలోని పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. నూతన వధూవరులు తమ కొత్త జీవితంలో మంచి ఆలోచన విధానంతో సమాజానికి మేలు చేకూరే విధంగా భవిష్యత్తును రూపొందించుకోవాలని ఆశీర్వదించారు. అభినవ సిద్ధలింగ స్వామి హరగిణడోణి స్వామిజీ మాట్లాడుతూ... ఉచిత సామూహిక వివాహాలు చేసుకున్న జంటలకు ప్రభుత్వాలు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో ఉచిత సామూహిక వివాహాలు జరిపించిన జే.ఎం.బసవరాజు స్వామి, వీరశైవ విద్యావర్ధక సంఘం అధ్యక్షుడు అల్లం గురు బసవరాజు, ప్రముఖులు గౌరిశంకర్, ఎర్రిస్వామి, కోళూరు చంద్ర, మంజునాథస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఉజ్జయిని స్వామీజీ