ఖమ్మంమయూరిసెంటర్: ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆర్టీసీ సీనియర్ వైద్యాధికారి ఏ.వీ.గిరిసింహారావు సూచించారు. ఖమ్మం కొత్త బస్టాండ్లో ఓ మహిళా ప్రయాణికురాలు సోమవారం ఉదయం వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో బస్టాండ్ ఆస్పత్రిలో విధుల్లో ఉన్న గిరిసింహారావు ఆమెకు వైద్యసేవలందించి మాట్లాడారు. ఉదయం 11నుండి సాయంత్రం 5 గంటల వరకు అత్యసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావొద్దని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
గేదె నరకయాతన
నేలకొండపల్లి: వేసవిలో గొంతు తడుపుకునేందుకు వెళ్లి చెరువు గాడిలో ఇరుక్కుపోయి ఓ గేదె రెండు రోజుల పాటు నరకయాతన అనుభవించింది. మండలంలోని చెరువుమాధారం చెరువులో రైతులు తీసిన గాడి కాల్వలో ఓ గేదె ఇరుక్కపోయింది. మంగాపురంతండా రైతుకు చెందిన గేదె రెండు రోజుల క్రితం నీరు తాగేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకోగా అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో చూడలేదు. సోమవారం గ్రామానికి చెందిన రైతులు గమనించి ట్రాక్టర్లకు తాళ్లు కట్టి గేదెను బయటకు తీశారు.
సుబాబుల్ తోటలో మంటలు
మధిర: మండలంలోని ఖమ్మంపాడులో రైతు వెలగా వెంకటేశ్వరరావు చెందిన చేలోని సుబాబుల్ తోట దగ్ధం కాగా, సమీపంలోని పొలాలకు సైతం మంటలు అంటుకున్నాయి. అగ్నిమాప క సిబ్బంది మంటలు ఆర్పి నా మళ్లీ మొదలుకావడంతో రైతుల్లో నెలకొంది. ఈమేరకు కల్యాణలక్ష్మి నారాయణ తదితరుల పొలాలకు మంటలు వ్యాపించగా అప్పటికే నీళ్లు అయిపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది మళ్లీ వెళ్లి నీళ్లు నింపుకుని వచ్చి మంటలు అదుపు చేశారు.
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
ఖమ్మంక్రైం: ఖమ్మంలోని రెండు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖమ్మం వన్టౌన్, త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన కొంపల్లి శేఖర్(48) సుతారీ పనిచేస్తుండగా, భార్య శ్రీలతతో గొడవ పడేవాడు. ఆయన ఈనెల 1వ తేదీన ఖమ్మం మేదర్బజార్లో భార్యతో గొడవ పడి తల్లి వద్దకు వచ్చాడు. అక్కడ ఎలుకల మందు తాగిన శేఖర్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అలాగే, ఖమ్మం ప్రకాష్నగర్లో బండారి సంపత్కుమార్(39) కారు డ్రైవర్గా పనిచేస్తూ భార్య హైమావతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు. ఆయన మద్యానికి బానిస కావటంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఇదేక్రమంలో ఆదివారం రాత్రి కూడా మద్యం తాగి రావడంతో భార్యతో గొడవ జరగగా.. అందరూ నిద్రించాక బయటకు వెళ్లిపోయాడు. అర్ధరాత్రి తర్వాత గుర్తించిన కుటుంబీకులు వెతకగా ఇంటి బయట ఉరి వేసుకుని ఉండడంతో ఇంటి యజమాని సాయంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు.
వ్యాన్ను ఢీకొట్టిన రాజధాని బస్సు
హెల్పర్, ఓ ప్రయాణికురాలికి గాయాలు
సత్తుపల్లి: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన ఆగిన డీసీఎం వ్యాన్ను రాజధాని ఏసీ బస్సు ఢీకొట్టింది. సత్తుపల్లి మండలం తాళ్లమడ వద్ద సోమవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం డిపోకు చెందిన రాజధాని ఏసీ బస్సు 30 మంది ప్రయాణికులతో విశాఖపట్నంకు వెళ్తోంది. ఈ క్రమంలో సత్తుపల్లి మండలం తాళ్లమడ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆగి ఉన్న డీసీఎం వ్యాన్ను ఢీ కొట్టడంతో బస్సు ముందు భాగంగానుజ్జునుజ్జయింది. బస్సులో ప్రయాణిస్తున్న హెల్పర్ మహేష్, ప్రయాణికురాలు దుర్గకు గాయాలు కాగా స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంతో ఆందోళనకు గురైన ప్రయాణికులు బస్సు అత్యవసర ద్వారం నుంచి బయటకు వచ్చారు. సీఐ టి.కిరణ్ సిబ్బందితో చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.