మధిర: మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సహా ఆరుగురు కౌన్సిలర్లు సోమవారం కాంగ్రెస్లో చేరారు. బోనకల్ మండలం రాయన్నపేటలో జరిగిన సమావేశంలో వారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షాన హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన వారిలో మున్సిపల్ వైస్ చైర్పపర్సన్ శీలం విద్యాలత వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు మల్లాది వాసు – సవిత, గద్దల మాధురి నాని, మేడికొండ కల్యాణి కిరణ్, ధీరావత్ మాధవి ఉన్నారు. అంతేకాక బీఆర్ఎస్ నాయకులు కరివేద సుధాకర్, గూడేల్లి నాగరాజు, మిషన్ భగీరథ తెలంగాణ కార్మిక సంఘం నాయకుడు గద్దల రాజా కూడా కాంగ్రెస్లో చేరారు.
నేడు హీరో వెంకటేష్ ప్రచారం
ఖమ్మంవన్టౌన్: సినీ హీరో వెంకటేష్ మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్ధి, తన వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి తరుపున ప్రచారంలో పాల్గొననున్నారు. సాయంత్రం 5గంటలకు ఖమ్మం మయూరి సెంటర్ నుండి ఇల్లెందు క్రాస్రోడ్డు వరకు జరిగే రోడ్డుషోలో ఆయన పాల్గొంటారు. ఆతర్వాత కొత్తగూడెం క్లబ్లో జరిగే పుర ప్రముఖుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారని కాంగ్రెస్ నాయకుడు తుంబూరు దయాకర్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్గా బాలకృష్ణ
ఖమ్మం లీగల్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ విభాగం వైస్ చైర్మన్గా వైరా మండలం గండగలపాడుకు చెందిన న్యాయవాది సూర్యదేవర బాలకృష్ణ నియమితులయ్యారు. అలాగే, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడుకు చెందిన న్యాయవాది నూతలపాటి అప్పారావును నియమించారు. ఈమేరకు రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ సోమవారం వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈమేరకు బాలకృష్ణ, అప్పారావును పలువురు న్యాయవాదులు అభినందించారు.
పాఠశాలలకు రూ.లక్ష విరాళం
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లిలోని ఎస్బీఎస్ బాలుర పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు 1981–82 బ్యాచ్ పూర్వవిద్యార్థులు రూ.50వేల చొప్పున రూ.లక్ష విరాళాన్ని సోమవారం అందజేశారు. ఈ నిధులను ఫిక్స్ చేసి వచ్చే వడ్డీతో పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సుధాకర్, కె.మల్లికార్జున్, గంగిశెట్టి ప్రసాద్, హెచ్ఎంలు యాకూబ్, ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రూ.25 లక్షల నగదు స్వాధీనం
ఖమ్మంక్రైం: ఖమ్మం త్రీటౌన్ పరిధిలోని ముగ్గురు వ్యాపారుల వద్ద రూ.25లక్షల నగదును సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా వ్యాపారులు వేర్వేరుగా నగదు తీసుకెళ్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు నర్తకి థియేటర్ సమీపాన చేపట్టిన తనిఖీల్లో గుర్తించారు. ఈమేరకు నగదును త్రీటౌన్ పోలీసులకు అప్పగించగా వారు సీజ్ చేశారు.
వ్యాపారి వద్ద రూ.1.72 లక్షలు...
నేలకొండపల్లి: లోక్సభ ఎన్నికల నేపథ్యాన అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యాపారి వద్ద రూ.1.72లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని కోనాయిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల సమీపాన సోమవారం స్పెషల్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఈసందర్భంగా చెన్నారానికి చెందిన వ్యాపారి సరైన పత్రాలు లేకుండా రూ.1.72 లక్షలు తీసుకెళ్తుండగా సీజ్ చేశారు.