‘ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా.. రాబోయే కాలంలోనూ సేవ చేయాలనే భావన నాలో ఉంది. నన్ను గెలిపించిన ప్రతీసారి ఖమ్మం జిల్లా, రాష్ట్ర ప్రజల గొంతుౖనై పార్లమెంట్లో మాట్లాడా. ప్రజల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావనకు రావాలంటే నామ నాగేశ్వరరావుతోనే సాధ్యమవుతుంది. అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. రైతు బిడ్డను, ఖమ్మం బిడ్డనైన నన్ను ఆశీర్వదించాలి. నాపై పోటీకి వచ్చిన వారెవరో ఆలోచన చేయాలి’ అని ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు కోరారు. సోమవారం నామ ‘సాక్షి’కి ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాలు ఆయన మాటల్లోనే.. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
పదేళ్లలోనే అభివృద్ధి..
భద్రాచలం – కొవ్వూరు రైల్వేలైన్ కోసం అనేక పోరాటాలు జరిగాయి. 40 ఏళ్ల నుంచి ఈ డిమాండ్ వింటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం నుంచి కొవ్వూరు వరకు రైల్వేలైన్ మంజూరైంది. 2012 రైల్వే బడ్జెట్లో పెట్టించాం. బయ్యారం ఉక్కు ప్రైవేటీకరించకుండా పార్లమెంట్లో పోరాడి అడ్డుకున్నా. బయ్యారం ఐరన్ఓర్ మైన్స్ను కాపాడింది నేనే. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఏపీ పునర్విభజన బిల్లులో ఉన్న పెండింగ్ సమస్యలపై రాబోయే కాలంలో పోరాడుతా. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకొచ్చా. మారుమూల గ్రామాల్లోనూ రోడ్లు ఉండేలా చూశాం. అలాగే తాగునీటి సరఫరా ఇప్పుడు మెరుగైంది. గత పదేళ్లలో మా నాయకుడు కేసీఆర్ హయాంలో విపరీతమైన అభివృద్ధి జరిగింది. గ్రామాలైనా, పట్టణాలైనా అభివృద్ధిని ప్రజలు చూసింది ఈ పదేళ్లలోనే. ఇంకా చేయాల్సి ఉంది.