జడ్చర్ల టౌన్/ మిడ్జిల్/ రాజాపూర్: తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. ఆదివారం ఆమె జడ్చర్ల పట్టణంతోపాటు రాజాపూర్, మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం, కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని, ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందని ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. మోదీ నాయకత్వంలో బీజేపీ మళ్లీ ఆధికారంలోకి రావడం చూసి కొత్త కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకాలతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు గ్రామాల్లో తిరుగుతున్నారని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. రైతుబంధు లేదని, రైతు రుణమాఫీ లేదని, మహిళలకు నెలకు ఖాతాలో రూ.2,500 జమ లేదని విమర్శించారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం..
బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అందుకే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తనను మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. జడ్చర్ల మున్సిపాలిటీలో నిర్వహించిన రోడ్షో క్రాస్రోడ్డు నుంచి నేతాజీ చౌరస్తా వరకు కొనసాగింది. మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్రెడ్డికి లేదన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలోని పేదరికాన్ని బీజేపీ దూరం చేసిందని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేశాకే కాంగ్రెస్ ప్రజలను ఓట్లు అడగాలన్నారు. దేశ భద్రత కోసం నరేంద్రమోదీని మళ్లీ ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. రాజాపూర్ మండలంలోని గ్రామాలకు చెందిన పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
బీజేపీ జాతీయ
ఉపాధ్యక్షురాలు డీకే అరుణ