జైలుకు వెళ్లడానికి కారణం ఇదే.. 14 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు ప్రముఖ నిర్మాత | Producer Singanamala Ramesh Babu After 14 Years Re Entry In Movie Industry | Sakshi
Sakshi News home page

జైలుకు వెళ్లడానికి కారణం ఇదే.. 14 ఏళ్ల తర్వాత మీడియా ముందుకు ప్రముఖ నిర్మాత

Feb 6 2025 1:31 PM | Updated on Feb 6 2025 1:45 PM

Producer Singanamala Ramesh Babu After 14 Years Re Entry In Movie Industry

టాలీవుడ్‌లో కొమరంపులి, ఖలేజా వంటి బిగ్‌ చిత్రాలను  నిర్మాత సింగనమల రమేష్‌బాబు  తాజాగా ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఒక కేసు విషయంలో దాదాపు 70 రోజుల పాటు జైలులో కూడా ఆయన ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ మీడియా ముందుకు ఎందుకొచ్చారు..? అనే విషయం గురించి ఆయన ఇలా చెప్పారు. ''నేనొక ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ని. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని నాపై కేసు పెట్టారు. 

14 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశాను. అది తప్పుడు కేసని తేలింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. తప్పుడు కేసులు కోర్టు ముందు నిలబడవు. నా న్యాయపోరాటం గెలిచింది' అని నిర్మాత శింగనమల రమేష్ బాబు అన్నారు . ‘కొమరంపులి’, ‘ఖలేజా’ లాంటి బిగ్ స్టార్ చిత్రాలని నిర్మించిన ఆయన ఓ కేసు నిమిత్తం 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఇటీవల ఆయన్ని నిర్దోషిగా తేల్చి, కేసు కొట్టి వేసింది. ఈ క్రమంలోనే  ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.  

రమేష్ బాబు.. మీపై కేసు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? 
నాకు ఎలాంటి కక్ష సాధింపులు లేవు. ఏదైనా న్యాయపరంగానే పోరాటం చేస్తా.

భవిష్యత్‌లో సినిమాల్లో కొనసాగుతారా ? 
నేనొక ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ని.. సినిమా అంటే పాషన్‌తో నిర్మాతగా మారాను. సినిమా నాకు తల్లి లాంటిది. భవిష్యత్తులోనూ ఇదే రంగంలో కొనసాగుతా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ హీరోలుగా చేశారు. హిట్ అందుకున్నారు. ఇప్పుడు డైరెక్షన్ రైటింగ్ చేయాలని అనుకుంటున్నారు. నేను కూడా నిర్మాతగా చేస్తా. ఫైనాన్షియర్‌గానూ చేస్తాను.

మీ మీద కేసు పెట్టింది ఎవరు..? వాళ్లకు సినీ రంగంతో సంబంధం ఉందా..? 
నాపై కేసు పెట్టిన వాళ్లు ఇండస్ట్రీ చెందిన వారు కాదు.

అగ్ర హీరోల చిత్రాలను నిర్మించి నష్టపోయారా?  
అప్పట్లో సినిమాలు ఆరు నెలలు, లేదా సంవత్సరంలోగా పూర్తయ్యేవి. కానీ నా దురదృష్టం కొద్ది నేను తెరకెక్కించిన కొన్ని పెద్ద హీరోల చిత్రాలు దాదాపు మూడేళ్ల సమయం చిత్రీకరణలోనే గడిచిపోయింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆ రెండు చిత్రాలకు రూ.100 కోట్ల వరకూ నష్టపోయా.

అసలు మీపై పెట్టిన కేసు ఏమిటి..?
రూ.14 కోట్లు మోసం చేశానని నా మీద అభియోగం మోపారు. మహాబలిపురంలో ఉన్న నా 10 ఎకరాల స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి.. ఇలా పలువురు వ్యక్తులకు అమ్మానని కేసు పెట్టారు. సుదీర్ఘంగా న్యాయ విచారణ జరిగింది. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా తేల్చింది. ఇప్పటికీ ఆ ఆస్తులు నా పేరు మీదే ఉన్నాయి.  

మీ స్టొరీనే సినిమా కథలా వుంది.. సినిమా చేసే అవకాశం ఉందా ? 
వెబ్ సిరీస్ చేస్తే వెయ్యి ఎపిసోడ్‌లు పెట్టొచ్చు. అయితే, నా కథ ఎవరు చూస్తారు(నవ్వుతూ)

ఫైనాన్స్ బిజినెస్ ఎంత లాభదాయకం ? 
మేము సంపాదించింది ఫైనాన్స్ బిజినెస్ వలనే. నాన్న గారి నుంచి అది నాకు వచ్చింది. ఐతే సినిమా మేకింగ్ అనేది ఎప్పటికీ ఓ జూదమే. ఆ గ్యాంబ్లింగ్ వలనే నాకు రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది. అయితే ప్రజెంట్ సినిమా నిర్మాణం బావుందని వింటున్నాను. నిర్మాతకు పది రూపాయలు మిగులుతాయని బయట అంటున్నారు.  

ఈ జర్నీలో మీరు నేర్చుకున్న పాఠం ? 
24 క్రాఫ్ట్స్ మన గ్రిప్‌లో ఉన్నప్పుడే సినిమా తీయాలి.

ఖలేజా సినిమాకి సి కళ్యాణ్ గారు ఒక పార్టనర్ కావడానికి కారణం ? 
కాదండీ.., నా డబ్బుతో ఆయన సినిమా పూర్తి చేశారు. కష్టాల్లో వున్నప్పుడు నాకు దేవుడే సపోర్ట్‌గా వున్నారు.  

ఎలాంటి సినిమాలు చేయాలని వుంది ? 
కథనే నా హీరో. కథని నమ్ముకొని సినిమా చేస్తాను. పెద్ద సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు అన్ని రకాల సినిమాలు చేయాలని వుంది. తర్వలోనే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వుండే అవకాశం వుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement