
జమ్మూ: అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజు శనివారం కూడా నిలిచిపోయింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడుతూ ఉండడంతో అధికారులు యాత్రను నిలిపివేశారు. యాత్రకు వెళ్లే మార్గం మధ్యలో వేలాది మంది భక్తులు చిక్కుకుపోయారు. భక్తులెవరూ ఆందోళనకు గురి కావొద్దని అధికారులు అనుక్షణం పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
అధికారులు ఇచ్చిన ఆదేశాలను భక్తులందరూ తూచ తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో రెండు మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్ ఆలయం ఉన్న ప్రాంతంలో విపరీతంగా మంచుకురుస్తోంది. ‘‘అమర్నాథ్ యాత్రకు వెళ్లే రెండు మార్గాలైన పాహల్గామ్, బాల్టాల్ మార్గాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను నిలిపివేస్తున్నాం’అని ఒక అధికారి వెల్లడించారు. బేస్ క్యాంప్ అయిన భగవతి నగర్ నుంచి శనివారం కొత్త బ్యాచ్ ఎవరినీ అనుమతించలేదు. జులై 1న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 31తో ముగుస్తుంది. 80 వేల మందికి పైగా భక్తులు ఈ ఏడాది యాత్రకు డబ్బులు చెల్లించారు.
Comments
Please login to add a commentAdd a comment