
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జనవరి 22న రామ్లల్లా పవిత్రోత్సవం జరగనుంది. ఈ నేపధ్యంలో ఇక్కడి హోటళ్ల బుకింగ్స్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయ్యాయి. హోటల్ రూమ్ బుకింగ్ ధర గతంలో కంటే ఐదు రెట్లు పెరిగింది.
అయోధ్యలో 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని పలు లగ్జరీ హోటళ్లలో ఒక రోజు రూమ్ బుకింగ్ లక్ష రూపాయల వరకూ చేరింది.
రామ్లల్లా పవిత్రోత్సవం రోజున మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఐదు లక్షల మంది వరకూ భక్తులు అయోధ్యకు వస్తారనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు రూమ్ల ధరలను అమాంతం పెంచేశారు. హోటల్ అయోధ్య ప్యాలెస్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె సుమారు రూ. 18,500 పలుకుతోంది. సాధారణంగా ఇక్కడ గది అద్దె రూ. 3,700. ది రామాయణ హోటల్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె రూ. 40 వేలు. 2023లో దీని అద్దె రూ. 14,900గా ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్లో ప్రస్తుతం ఒకరోజు అద్దె దాదాపు రూ.70, 500. గత ఏడాది జనవరిలో ఇక్కడ గది అద్దె రూ. 16,800గా ఉండేది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం అయోధ్యలోని రామాయణ్ హోటల్లోని గదుల బుకింగ్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయింది. ఈ హోటల్లోని గదులు జనవరి 20 నుండి 23 వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఈ హోటల్లో గది అద్దె రోజుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ పెరిగింది. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్లోని విలాసవంతమైన గది ఒకరోజు అద్దె లక్ష రూపాయలకు బుక్ అయ్యింది. ఈ హోటల్లోని గదులన్నీ బుక్ అయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. గతంలో ఈ హోటల్లో గది అద్దె కనీసంగా రూ.7,500 ఉండేది.
ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి
Comments
Please login to add a commentAdd a comment