
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో హుషారు పెరిగిపోతోంది. తూర్పు ఢిల్లీ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన ఒక ట్వీట్లో తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరారు. అదే సమయంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ను బీజేపీ ఇక్కడి నుంచి ఎన్నికల రంగంలోకి దించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గౌతమ్ గంభీర్ తాను ఇకపై తన క్రికెట్ కమిట్మెంట్లపై దృష్టి పెడతానని అంటున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ను బీజేపీ.. ఢిల్లీలోని ఒక స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయమని కోరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయనతో కొందరు పార్టీ నేతలు టచ్లో ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అక్షయ్ కుమార్ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్ కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. అతని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయన లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ సీటు నుంచి ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. నాటి ఎన్నికల్లో గౌతమ్ గంభీర్ 6,96,156 ఓట్లతో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment