
న్యూఢిల్లీ: భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. దేశ భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న ఆయన ఈశాన్య రాష్ట్రాలతోపాటు జమ్మూకశ్మీర్లో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడంలో సమర్థంగా పనిచేశారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి దాయాది దేశం పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టించారు. సైనికుడిగా 40 ఏళ్లు నిర్విరామంగా మాతృదేశానికి సేవలందించారు. భారత సైన్యంలో ఆయన ప్రయాణం ఆసక్తికరం. అత్యున్నత అధికారిగా పైకి ఎదిగిన తీరు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.
తరతరాలుగా దేశ సేవలోనే..
బిపిన్ రావత్ కుటుంబం తరతరాలుగా భారత సైన్యంలో సేవలందిస్తోంది. ఆయన తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెఫ్టినెంట్ జనరల్గా పనిచేశారు. బిపిన్ 1958 మార్చి 16న ఉత్తరాఖండ్ రాష్ట్రం పౌరీ గర్వాల్ జిల్లాలో జన్మించారు. డెహ్రాడూన్లోని కాంబ్రియన్ హాల్ స్కూల్, షిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్లో చదివారు. తమిళనాడు రాష్ట్రం వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ(డీఎస్ఎస్సీ)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కాన్సాస్లోని ఫోర్ట్ లీవెన్వర్త్లో ఉన్న యూఎస్ ఆర్మీ కమాండ్, జనరల్ స్టాఫ్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్సు అభ్యసించారు. దేవీ అహల్యా యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు.
1978 డిసెంబర్ 16న 11వ గూర్ఖా రైఫిల్స్ దళానికి చెందిన 5వ బెటాలియన్లో సెకండ్ లెఫ్టినెంట్గా చేరారు. సైనికుడిగా జీవితాన్ని ఆరంభించారు. తూర్పు సెక్టార్లో భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద విధులు నిర్వర్తించారు. తర్వాత బ్రిగేడియర్గా పదోన్నతి పొందారు. సోపోర్లో రాష్ట్రీయ రైఫిల్స్ 5వ సెక్టార్ అధికారిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి మిషన్ కింద కాంగో దేశంలో మల్టీనేషనల్ బ్రిగేడ్లో సేవలందించారు. మేజర్ జనరల్గా పదోన్నతి పొందాక యూరీలోని 19వ ఇన్ఫాంట్రీ డివిజన్ జనరల్ ఆఫీసర్గా వ్యవహరించారు.
లెఫ్టినెంట్ జనరల్గా దిమాపూర్, పుణేలో పనిచేశారు. 2016లో దక్షిణ కమాండ్లో కమాండింగ్–ఇన్–చీఫ్ జనరల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. కొన్ని నెలలకే ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్గా పదోన్నతి పొందారు. 2016 డిసెంబర్లో భారత సైన్యానికి 27వ అధినేతగా(ఆర్మీ చీఫ్) బాధ్యతలు నియమితులయ్యారు. బిపిన్ రావత్కు భార్య మధూలిక రావత్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
భయమంటే ఏమిటో తెలియదు
ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా రావత్కు ఓ పేరుంది. భయమంటే ఏమిటో ఆయనకు తెలియదని, విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారని సహచరులు చెబుతుం టారు. ఆర్మీ చీఫ్గా, సీడీఎస్గా పలు సందర్భాల్లో రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 2016 నుంచి 2019 దాకా ఆర్మీ చీఫ్గా జమ్మూకశ్మీర్లో సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. భారత్కు చైనా నుంచే అసలు ముప్పు పొంచి ఉందని, డ్రాగన్ను దీటుగా ఎదిరించడానికి మన సైనిక దళాలను బలోపేతం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఒప్పించారు.
చదవండి: (Bipin Rawat: పది నిమిషాల్లో ల్యాండింగ్.. ఆ ఐదు నిమిషాల్లోనే ఘోరం!)
2017లో డోక్లామ్ ఘటన కంటే ముందు ఆయన చైనా కుతంత్రాన్ని గుర్తించారు. నాగా మిలిటెంట్లను అణచివేయడానికి 2015లో భారత సైన్యం మయన్మార్ భూభాగంలోకి అడుగుపెట్టి మరీ దాడులు చేయడంలో రావత్దే ముఖ్యపాత్ర. పాకిస్తాన్పై సర్జికల్ దాడులకు స్వయంగా ప్రణాళిక రూపొందించారు. పాక్లోని బాలాకోట్లో జైషే మొహమ్మద్ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఫైటర్ జెట్లతో బాంబుల వర్షం కురిపించారు. 40 ఏళ్ల కెరీర్లో ఎక్కువ కాలం ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్లోని ఘర్షణాత్మక ప్రాంతాల్లోనే జనరల్ రావత్ విధులు నిర్వర్తించారు. 2019లో పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
చదవండి: (భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే)
భారత సైన్యంలో అంచెలంచెలుగా..
► సెకండ్ లెఫ్టినెంట్ 1978 డిసెంబర్ 16
► లెఫ్టినెంట్ 1980 డిసెంబర్ 16
►కెప్టెన్ 1984 జూలై 31
► మేజర్ 1989 డిసెంబర్ 16
► లెఫ్టినెంట్ కల్నల్ 1998 జూన్ 1
► కల్నల్ 2003 ఆగస్టు 1
► బ్రిగేడియర్ 2007 అక్టోబర్ 1
► మేజర్ జనరల్ 2011 అక్టోబర్ 20
► లెఫ్టినెంట్ జనరల్ 2014 జూన్ 1
► జనరల్(సీఓఏఎస్) 2017 జనవరి 1
►జనరల్(సీడీఎస్) 2019 డిసెంబర్ 31
Comments
Please login to add a commentAdd a comment