ఆర్మూర్, భీంగల్: ఎన్నికల్లో పోలింగ్ నిర్వహణకు చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ శాసనసభా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కలెక్టర్ ఆదివారం సందర్శించారు. ఆర్మూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీంగల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న కమిషనింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. గందరగోళానికి తావులేకుండా పోలింగ్ కేంద్రాల వారీగా కమిషనింగ్ జరిపించాలని సహాయ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కాగా, ఆర్మూర్, భీంగల్ పట్టణాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఎంపీడీవో కార్యాలయాలు, విశ్రాంత ఉద్యోగుల భవన్లో ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాలను సైతం కలెక్టర్ సందర్శించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ రిజిస్ట్రేషన్, ఓటర్స్ రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన రిజిస్టర్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు వస్తున్న వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సహకారం అందించాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, అధికారులు ఉన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు