కమ్మర్పల్లి: మండలంలోని కోనాపూర్లో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి రూ. 5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన మంగి హరీశ్ కొత్త చెరువు తండా రోడ్లో డెయిరీ ఫాం నడుపుతున్నాడు. ఫాంలో ఆరు ఆవులు, ఏడు బర్రెలు, ఐదు దూడలు ఉన్నా యి. ఫాంకు సమీపంలో ఉన్న వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో అవి డెయిరీ ఫాం వరకు వ్యాపించాయి. దీంతో ఫాంలోని గడ్డికట్టలతో పాటు పశువుల దాణాకు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న హరీశ్ అక్కడికి చేరుకొని పశువులకు కట్టిన తాళ్లను తొలగించి విడిచి పెట్టాడు. మంటలు చెలరేగి షెడ్డుకు అంటుకున్నాయి. మెట్పల్లి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే షెడ్డు కాలిపోవడంతో పాటు ఎండు గడ్డి కట్టలు, పశువుల దాణా, సామాగ్రి కాలి బూడిదైంది. సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.