
సాక్షి, హైదరాబాద్: యాదృచ్చికమో..ఉద్దేశపూర్వకమో.. తెలియదు కానీ ఎన్నికలు ఏవైనా సరే.. ఇంటి పేరు సహా ఒకే పేరు ఉన్న వేర్వేరు అభ్యర్థులు పోటీ చేయడం రివాజుగా మారింది. పేరు మాత్రమే కాకుండా ఇంటి పేర్లు కూడా ఒకేలా ఉండటంతో ఓటర్లలో నిరక్షరాస్యులు, అవగాహన కొందరు ఓటర్లలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.ఈనెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోని చాలా నియోజక వర్గాలలో ఈ సమస్య కనిపిస్తోంది.
ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులను పోలిన వారే
ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులను పోలిన పేర్లున్న వారే స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. కొన్ని చోట్ల అలయెన్స్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ (ఏడీఆర్) పేరుతోనూ ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల నేతలు.. పోటీ చేసే పార్టీ గుర్తు, అభ్యర్థి ఫొటోతో పాటు పేరును కూడా తెగ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను గందరగోళానికి గురి చేయడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు.
ఒకే పేరు కలిగి పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో కొన్ని
ఎల్బీనగర్: దేవిరెడ్డి సుధీర్రెడ్డి (బీఆర్ఎస్), దేవిరెడ్డి సు«దీర్రెడ్డి (స్వతంత్ర), డి.సుధీర్రెడ్డి (స్వ)
మహేశ్వరం: కె.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), కె.లక్ష్మారెడ్డి (జన శంఖారావం), పి.సబిత (బీఆర్ఎస్), ఎం.సబిత (స్వ)
మునుగోడు: కె.ప్రభాకర్రెడ్డి (బీఆర్ఎస్), కె.ప్రభాకర్రెడ్డి (ఏడీఆర్)
మిర్యాలగూడ: బి.లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), బి.లక్ష్మారెడ్డి (స్వ)
అచ్చంపేట: జి.బాలరాజు (బీఆర్ఎస్), జి.బాలరాజు (ఏడీఆర్)
దేవరకద్ర: ఏ.వెంకటేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్), ఏ.వెంకటేశ్వర్రెడ్డి (స్వ)
గద్వాల: సరిత (కాంగ్రెస్), జి.సరిత (నవతరం కాంగ్రెస్), సరిత (స్వ)
సనత్నగర్: శ్రీనివాస్యాదవ్ (బీఆర్ఎస్), ఉప్పలపాటి శ్రీనివాస్ (యుగ తులసి)
జహీరాబాద్: ఏ.చంద్రశేఖర్ (కాంగ్రెస్), చంద్రశేఖర్, ఎం.చంద్రశేఖర్, ఎడ్ల చంద్రశేఖర్ (స్వ)
ఇబ్రహీంపట్నం: మంచిరెడ్డి కిషన్రెడ్డి (బీఆర్ఎస్), కె.కిషన్రెడ్డి (ఏడీఆర్)
ఉప్పల్: బండారి లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్), మన్నె లక్ష్మారెడ్డి (ఏడీఆర్)
పరిగి: కొప్పుల మహేశ్రెడ్డి (బీఆర్ఎస్), బి.మహేశ్రెడ్డి (ఏడీఆర్)
కొడంగల్: పట్నం నరేందర్రెడ్డి (బీఆర్ఎస్), ప్యాట నరేందర్ రెడ్డి (స్వ)
నారాయణపేట: ఎస్.రాజేందర్రెడ్డి (బీఆర్ఎస్), కె.రాజేందర్ రెడ్డి (స్వ)
మహబూబ్నగర్: వి.శ్రీనివాస్గౌడ్ (బీఆర్ఎస్), ఎం.శ్రీనివాసులు (స్వ)
కొల్లాపూర్: బి.హర్షవర్ధన్ రెడ్డి (బీఆర్ఎస్), కె.హర్షవర్ధన్ రెడ్డి (స్వ)
హుజూర్నగర్: ఎస్.సైదిరెడ్డి (బీఆర్ఎస్), టి.సైదిరెడ్డి (ఏడీఆర్)
ఖమ్మం: పువ్వాడ అజయ్ (బీఆర్ఎస్), ఏ.అజయ్ (స్వ), కె.అజయ్ (స్వ)
ముషీరాబాద్: ముఠాగోపాల్ (బీఆర్ఎస్), ఎం.గోపాల్ (ఏఐహెచ్సీపీ)
(నోట్: స్వతంత్రులు (స్వ), అలయెన్స్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్)
ఎన్నికలు బహిష్కరిస్తూ తీర్మానం
కొత్తగూడెంరూరల్: తమ సమస్యలు పరిష్కరించనందున నాలుగు గ్రామ పంచాయతీల ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తామంటున్నారు. ఈ మేరకు వారు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కొత్త చింతకుంట, లక్ష్మీపురం, బొజ్జలగూడెం, బంగారుచెలక గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేశారు.
సర్వే నంబర్ 286, 381 అసైన్మెంట్ భూ హక్కుదారుల పేర్లను ధరణిలో చేర్చాలని, వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని, గిరివికాస్ పథకంలో అర్హులైన రైతులందరికీ వ్యవసాయ బోర్లు మంజూరు చేయాలని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహలక్ష్మి పథకం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ఎన్నో రోజులుగా పోరాడుతున్నా ఎవరూ పట్టించుకోనందుకు నిరసనగా ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment