
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్పై మంత్రి జోగి రమేష్ సీరియస్ అయ్యారు. పాలకుడిని కాదు.. పాలేరునని పవన్ ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ని నమ్ముకుంటే నట్టేట ముంచారని కార్యకర్తలు బాధ పడుతున్నారని కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి జోగి రమేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు పాలేరు. పదేళ్లుగా జెండాలు మోసిన జనసైనికులు ఆత్మరక్షణలో పడ్డారు. పవన్ ప్యాకేజీ స్టార్ తప్ప పాలకుడు కాదని మేం చెబుతూనే ఉన్నాం. పవన్ పూజకు పనికిరాని పువ్వు లాంటి వ్యక్తి. పాలకుడిని కాదు.. పాలేరునని పవన్ ఒప్పుకున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ జనసేన నేతల పేరుతో టీడీపీ వారే పోటీ చేస్తారు. జనసైనికులు కూడా పాలేరులుగా మారకుండా నిర్ణయం తీసుకోవాలి.
గతంలో పవన్ కుటుంబ సభ్యులను సైతం చంద్రబాబు మనుషులు బూతులు తిట్టారు. పార్టీ పెట్టి పదేళ్లయినా పవన్ ఏమీ సాధించలేక పోయాడు. చంద్రబాబు కుతంత్రాలు ఇలాగే ఉంటాయి. పాలకుడు ఎవరో, పాలేరు ఎవరో గుర్తించి వ్యవహరించాలి అంటూ సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ఆగినట్టే: సీఎం జగన్