![MLA Roja Condemns TDP Gali Bhanu Prakash Corruption Allegations - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/7/roja_0.jpg.webp?itok=jKGfkAaB)
సాక్షి, నగరి: తనపై అసత్య ప్రచారాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే ఆర్కే రోజా గాలి భానుప్రకాష్పై మండిపడ్డారు. ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో తనపై గాలి భానుప్రకాష్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయి రెండేళ్లుగా నియోజకవర్గం వైపు తిరిగిచూడని ప్రబుద్ధుడు ఇప్పుడు ప్రత్యక్షమై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
అవినీతిపరుడైన భానుకు అందరూ అవినీతిపరుల్లానే కనిపిస్తారన్నారు. తాను నంబర్వన్ హీరోయిన్గా ఉన్నప్పుడే మద్రాసులో ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. వైఎస్సార్సీపీలోకి రాకముందు హైదరాబాద్లో ఇల్లు నిర్మించుకున్నానని, నగరిలో ఇల్లు పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు కట్టానని తెలిపారు. నియోజకవర్గ ప్రజల మధ్యలో ఉండాలని ఇల్లు కట్టుకుట్టున్నట్టు వెల్లడించారు.
ప్రతి ఒక్కటీ తన సొంత డబ్బుతో కట్టిందేనన్నారు. అక్రమంగా సంపాదించాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. జగనన్న అడుగుజాడల్లో క్రమశిక్షణతో పనిచేసే తనకు ఒకరికి ఇవ్వడమే కానీ, తీసుకోవడం అలవాటు లేదన్నారు. ఈ నేపథ్యంలోనే రోజా చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నానన్నారు.
నీ కారణంగానే ముద్దుకృష్ణమ మృతి చెందారట!
ఈయన కారణంగానే ముద్దుకృష్ణమ నాయుడు చనిపోయారని ఆయన తల్లి, తమ్ముడు అసహ్యించుకుంటున్నారని, ముందు వారి కాళ్లమీద పడి క్షమాపణ చెప్పుకోవాలన్నారు. తన సొంత ఇంటిలోనే అతనికి మంచి పేరులేదని, ఇంట గెలవలేని ఈయన రచ్చ ఎలా గెలుస్తాడన్నారు.
రాజీనామా వార్త అవాస్తవం
తాను రాజీనామా చేస్తున్నట్లు సోషల్మీడియా, మీడియాలో వస్తున్న వార్తలపైనా ఆమె స్పందించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తెలంగాణకు వెళుతున్నానని అసత్య ప్రచారాలు కొందరు పనిగట్టుకుని చేస్తున్నారన్నారు. తానెందుకు పార్టీ నుంచి వెళతానని ప్రశ్నించారు. తప్పుచేసినవారు వెళ్లాలన్నారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. సొంత చెల్లిగా భావించి రెండు సార్లు ఎమ్మెల్యేను చేసిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని, ప్రాణం ఉన్నంత వరకు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment