
సాక్షి, అనంతపురం: జిల్లాలో టీడీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కాల్వ శ్రీనివాస్ల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఓడిపోవడం ఖాయమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి జోస్యం చెప్పుకొచ్చారు. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని సూచించారు. కార్యకర్తలను టీడీపీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
(చదవండి: ఓటమి భయంతో జేసీ కంటతడి..!)
తనకు, కార్యకర్తలకు ఏ మాత్రం సమాచారం లేకుండానే మీటింగ్లు నిర్వహిస్తున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ వైఖరిని తప్పుపట్టారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ కనుసన్నల్లోనే ఇలా జరుగుతుందన్నారు. కాల్వ శ్రీనివాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలానే జరిగితే త్వరలోనే కార్యకర్తలు తామే స్వయంగా మీటింగ్ పెట్టుకుంటారని జేసీ హెచ్చరించారు. పెద్దవాళ్లను దృష్టిలో పెట్టుకుని తాను ఇలా మాట్లాడటం లేదని.. తమను పలకరించిన వారే లేరని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలను సరిగా చూసుకోవడం లేదు.. టీడీపీ నేతలను కార్యకర్తలు నమ్మటంలేదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.