బేస్తవారిపేట: వైఎస్సార్ సీపీలో ప్రతి నాయకుడు, కార్యకర్తను నా సొంత కుటుంబసభ్యుడిగానే భావిస్తున్నానని ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సోమవారం బేస్తవారిపేట మండల వైఎస్సార్ సీపీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ప్రతి కుటుంబానికి న్యాయం చేయడంతోనే ధైర్యంగా ఓడు అడుగుతున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ అంటే నమ్మకం, శక్తి, ధైర్యాన్ని ఇచ్చారన్నారు. ఇంటివద్దకే పాలన, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు, కుల, మతాలకు అతీతంగా సేవలను అందించిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని సీఎం కల్పించారన్నారు. ప్రతి సమస్యలో భాగమై మీతో పాటు నడుస్తానని తెలిపారు. సీఎం నాకు ధైర్యాన్ని ఇచ్చి నియోజకవర్గానికి పంపించారన్నారు. దేశానికి సేవ చేసే సైనికులు, మాజీ సైనికులు గిద్దలూరు నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నారని, వారికి సేవ చేసుకునే అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సమస్య నా సమస్యగా భావించి పరిష్కరించేందుకు ముందుంటానని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వదిలిపెట్టి కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కష్టపడుదామన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ కుటుంబం పాటుపడుతుందన్నారు. చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడన్నారు. చంద్రబాబుకు హామీలు ఇవ్వడమేకాని నెరవేర్చడం తెలియదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వేగినాటి ఓసూరారెడ్డి, జెడ్పీటీసీ బీవీ రాజయ్య, మాజీ ఎంపీపీ పి.వెంకటరాజు, మాజీ జెడ్పీటీసీలు తాతపూడి ఐజయ్య, చిలకల జయమ్మ, జేఏసీ చైర్మన్ టీవీఎస్పీ శర్మ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొండా రఘునాథరెడ్డి, మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొల్లా బాలిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు గుంటి స్వప్న, డీ ఖాజామీయా, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ శ్రేణులంతా నా కుటుంబ సభ్యులే
గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి