● పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల, అంకిరెడ్డిపల్లె గ్రామాల్లో బుధవారం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం ధాన్యం విక్రయించి డబ్బులు పొందిన రైతుకు కొనుగోలు కేంద్రం నిర్వాహకుడితో ఫోన్ చేయించి కమిషనర్ మాట్లాడారు. డబ్బులు ఎన్ని రోజుల్లో ఖాతాలో పడ్డాయని, ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా.. అని తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధైర్య పడొద్దని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ధాన్యం పైన, కింద టార్పాలిన్లు పెట్టాలని సూచించారు. తూకం వేసి ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి జితేందర్రెడ్డి, మేనేజర్ జితేంద్రప్రసాద్, డీఆర్డీవో శేషాద్రి, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, ఏపీవో పాపారావు పాల్గొన్నారు.