Ex PAK Player: BCCI Doing Right Thing PCB Should Learn Blunt Reply - Sakshi
Sakshi News home page

వాళ్లకేం ఖర్మ? ఐపీఎల్‌కు ఏదీ సాటి రాదు.. బీసీసీఐని చూసి పీసీబీ నేర్చుకోవాలి: పాక్‌ మాజీ ప్లేయర్‌

Feb 26 2023 9:31 AM | Updated on Feb 26 2023 10:55 AM

Ex PAK Player: BCCI Doing Right Thing PCB Should Learn Blunt Reply - Sakshi

భారత క్రికెట్‌ జట్టు

BCCI- Indian Premier League: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ప్రపంచంలోని పొట్టి ఫార్మాట్‌ లీగ్‌లన్నింటిలోకి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అనడంలో సందేహం లేదు. యువ ఆటగాళ్లు ఒక్కసారి ఈ వేదికపై ప్రతిభ నిరూపించుకుంటే చాలు కోటీశ్వరుల జాబితాలో చేరిపోతారు. జాతీయ జట్టులో అవకాశాలు చేజిక్కించుకుంటారు. 

ఇక వెటరన్‌ ప్లేయర్లు సైతం ఇక్కడ తమను తాము నిరూపించుకుంటే మరికొంత కాలం కెరీర్‌ పొడిగించుకోగలుగుతారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే.. స్టార్‌ క్రికెటర్లపై కాసుల వర్షం కురుస్తుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని ఐపీఎల్‌ ద్వారా ఇప్పటికే ఎంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు కెరీర్‌ పరంగా, ఆర్థికంగా నిలదొక్కుకున్న దాఖలాలు కోకొల్లలు. అయితే, అంతబాగానే ఉన్నా బీసీసీఐ తమ క్రికెటర్లను మాత్రం విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఇవ్వదన్న విషయం తెలిసిందే.

ఈ విషయంలో బీసీసీఐని సమర్థిస్తూ పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు కమ్రాన్‌ అక్మల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌ బోర్డు సరైన పనిచేస్తోందని ప్రశంసించాడు. కాగా పాక్‌లో ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ ఎనిమిదో సీజన్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడిన అక్మల్‌కు.. టీమిండియా క్రికెటర్లు పీఎస్‌ఎల్‌ ఆడటానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుందన్న ప్రశ్న ఎదురైంది.


కమ్రాన్‌ అక్మల్‌

వాళ్లకేం అవసరం?
ఇందుకు స్పందిస్తూ.. ‘‘భారత క్రికెటర్లు పీఎస్‌ఎల్‌లో అస్సలు ఆడకూడదు. విదేశీ లీగ్‌లలో తమ ప్లేయర్లను ఆడించే విషయంలో ఇండియన్‌ బోర్డు సరైన దిశలో పయనిస్తోంది. ఐపీఎల్‌ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత వరుస అంతర్జాతీయ సిరీస్‌లు ఉంటాయి. నిజానికి ఐపీఎల్‌ ద్వారా ఆర్థికంగా వాళ్లు కావాల్సిన మేర పరిపుష్టం అవుతారు.

పీసీబీ బీసీసీఐని చూసి నేర్చుకోవాలి
అలాంటపుడు విదేశీ లీగ్‌లలో ఆడాల్సిన అవసరం వాళ్లకేం ఉంటుంది? నిజానికి మన బోర్డు(పీసీబీ) కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఆటగాళ్ల కెరీర్‌ను పొడిగించుకునేందుకు వాళ్లు పాటిస్తున్న విధానాలు గమనించాలి. అక్కడ వంద టెస్టులాడిన వాళ్లు దాదాపు 14- 15 మంది ప్లేయర్లు ఉన్నారు.

కానీ ఇక్కడ ఒకరో.. ఇద్దరో ఉంటారు. ఇండియాలో వాళ్లు క్రికెట్‌కు, క్రికెటర్లకు విలువనిస్తారు. ఐపీఎల్‌ ద్వారా ఆటగాళ్లకు భారీ మొత్తంలో చెల్లిస్తారు. నిజానికి ఐపీఎల్‌ ముందు బీబీఎల్‌(బిగ్‌బాష్‌ లీగ్‌) దిగదిడుపే. ప్రపంచంలో ఏ లీగ్‌ కూడా ఐపీఎల్‌కు సాటిరాదు’’ అని మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమ్రాన్‌ పేర్కొన్నాడు. బీసీసీఐని చూసైనా పీసీబీ బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించాడు.

చదవండి: Virat Kohli: అత్యాశ లేదు! బాధపడే రకం కాదు.. ఆయనకు ఫోన్‌ చేస్తే 99 శాతం లిఫ్ట్‌ చేయడు.. అలాంటిది..
BGT 2023: ‘టమ్‌ టమ్‌’ పాటకు టీమిండియా క్రికెటర్‌ స్టెప్పులు.. వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement