
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టి20 టోర్నమెంట్ రెండో సీజన్లో రాయలసీమ కింగ్స్ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఇక్కడి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్ జట్టును ఓడించింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్లో రాయలసీమ కింగ్స్ 12 పాయింట్లతో టాప్ ర్యాంక్లో ఉంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన గోదావరి టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 150 పరుగులు చేసింది. త్రిపురాణ విజయ్ (25 బంతుల్లో 63 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో అజేయ అర్ధ సెంచరీ చేశాడు. రాయలసీమ కింగ్స్ బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు, గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం రాయలసీమ కింగ్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. కెపె్టన్ హనుమ విహారి (12 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ రెడ్డి (37 బంతుల్లో 53; 7 ఫోర్లు, 2 సిక్స్లు), తన్నీరు వంశీకృష్ణ (39 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. గోదావరి టైటాన్స్ బౌలర్లు ఏకంగా 21 ఎక్స్ట్రాలు ఇవ్వడం గమనార్హం.
తపస్వి ఆల్రౌండ్ ప్రదర్శన
మరో మ్యాచ్లో ఉత్తరాంధ్ర లయన్స్ 93 పరుగుల తేడాతో వైజాగ్ వారియర్స్పై ఘనవిజయం సాధించింది. ముందుగా ఉత్తరాంధ్ర లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెపె్టన్ కోన శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్స్లు), వెంకట్ రాహుల్ (36 బంతుల్లో 53; 3 ఫోర్లు, 3 సిక్స్లు), పిన్నింటి తపస్వి (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్లు), సిర్లా శ్రీనివాస్ (13 బంతుల్లో 33 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్లు) దూకుడుగా ఆడారు. అనంతరం వైజాగ్ వారియర్స్ 14.4 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. తపస్వి, పృథీ్వరాజ్ మూడు వికెట్ల చొప్పున తీశారు.
Comments
Please login to add a commentAdd a comment