ODI Cricketer Of The Year 2023: వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-2023 నామినీస్గా ముగ్గురు టీమిండియా క్రికెటర్లు
Published
Thu, Jan 4 2024 5:03 PM
ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023 నామినీస్ జాబితాను ఇవాళ (జనవరి 4) ప్రకటించింది. అవార్డు రేసులో ఏకంగా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు ఉండటం విశేషం. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో అద్బుత ప్రదర్శన కనబర్చిన విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీతో పాటు గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించిన శుభ్మన్ గిల్ ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు కోసం పోటీపడనున్నారు. వీరితో పాటు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ రేసులో నిలిచాడు. మిచెల్ సైతం గతేడంతా వన్డేల్లో అద్భుతంగా రాణించడంతో పాటు వరల్డ్కప్ 2023లోనూ చెలరేగిపోయాడు.
కాగా, ఐసీసీ నిన్న మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ (2023), మెన్స్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ (2023) అవార్డుల కోసం నామినీస్ జాబితాను ప్రకటించింది. టీ20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రేసులో టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్తో పాటు జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా, న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్మన్, ఉగాండ ఆటగాడు అల్పేశ్ రామ్జనీ ఉండగా.. ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో టీమిండియా అప్కమింగ్ స్టార్ యశస్వి జైస్వాల్తో పాటు న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర, సౌతాఫ్రికా పేసర్ గెరాల్డ్ కొయెట్జీ, శ్రీలంక పేసర్ దిల్షన్ మధుషంక నిలిచారు. గతేడాది ఆయా విభాగాల్లో ప్రదర్శన ఆధారంగా ఐసీసీ నామినీస్ జాబితాను ఎంపిక చేసింది.