T20 WC 2024: వరల్డ్‌కప్‌ జట్టులో రిషభ్‌ పంత్‌? | Sakshi
Sakshi News home page

T20 WC: వరల్డ్‌కప్‌ జట్టులో రిషభ్‌ పంత్‌?.. గంగూలీ ఆన్సర్‌ ఇదే

Published Sun, Apr 7 2024 11:57 AM

Will Be Able To: Sourav Ganguly On Rishabh Pant T20 WC Selection - Sakshi

ఐపీఎల్‌-2024 ద్వారా పునరాగమనం చేసిన టీమిండియా స్టార్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ అద్బుత ఆట తీరు కనబరుస్తున్నాడు. గతంలో మాదిరి తనదైన శైలిలో షాట్లు బాదుతూ అభిమానులను అలరిస్తున్నాడు. బ్యాటర్‌గా, వికెట్‌ కీపర్‌గా పూర్తి స్థాయిలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సేవలు అందిస్తున్నాడు ఈ కెప్టెన్‌ సాబ్‌.

ఇక ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ముగిసిన తర్వాత టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్‌కప్‌ బెర్తులు ఖరారు కానున్నాయి. 

ముఖ్యంగా వికెట్‌ కీపర్‌ కోటాలో సంజూ శాంసన్‌ ఇప్పటికే రేసులో ముందు వరుసలో ఉండగా.. పంత్‌ సైతం తానేమీ తక్కువ కాదన్నట్లు వరుస హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో రిషభ్‌ పంత్‌ వరల్డ్‌కప్‌ సెలక్షన్‌ గురించి బీసీసీఐ మాజీ బాస్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

వరల్డ్‌కప్‌ జట్టులో పంత్‌?
వరల్డ్‌కప్‌ జట్టులో పంత్‌ చోటు దక్కించుకోగలడా అన్న ప్రశ్నకు బదులిస్తూ..‘‘ఇంకొన్ని మ్యాచ్‌లు పూర్తి కానివ్వండి. ప్రస్తుతం అతడు బాగా ఆడుతున్నాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్‌ కూడా చేస్తున్నాడు.

సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‌లలో అద్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోవారం గడిస్తే గానీ నేను ఈ ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వలేను. సెలక్టర్లు పంత్‌​ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడే అంచనా వేయలేను. ప్రస్తుతానికి పంత్‌ పూర్తి ఫిట్‌గా ఉన్నాడు’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. 

ఆటగాడిగా రాణిస్తున్నా.. కెప్టెన్‌ విఫలం!
కాగా డిసెంబరు, 2022లో పంత్‌ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతడు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడగా అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఈ ఉత్తరాఖండ్‌ క్రికెటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా దాదాపు ఏడాదిన్నర పాటు అతడు ఆటకు దూరమయ్యాడు.

ఇక రీఎంట్రీలో ఆటగాడిగా రిషభ్‌ పంత్‌ రాణిస్తున్నా కెప్టెన్‌గా మాత్రం విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. మూడింటిలో ఓడిపోయింది.

తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్‌ ఆరంభం కానుంది. 
చదవండి: Virat Kohli: ఇంత స్వార్థమా?.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లి చెత్త రికార్డు

Advertisement
Advertisement