Andhra Pradesh: Youth kills self over online gambling debts - Sakshi
Sakshi News home page

Online Betting: మ్యాచ్‌ మ్యాచ్‌కు ఉత్కంఠ.. ఉన్నదిపాయే, ఉంచుకున్నది పాయే! జీవితమే!

Jul 5 2023 12:38 PM | Updated on Jul 5 2023 1:58 PM

Youth kills self over online gambling debts - Sakshi

భారత్‌లో క్రికెట్‌ అంటే ఒక మతం. మన దేశ జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ క్రికెటే ఎక్కువ మంది అభిమానించే ఆటగా మారిపోయింది. మ్యాచ్‌ ప్రారంభం కాకముందే టీవీలకు అతుక్కుపోయేవాళ్లు  ఇప్పటికి చాలా మంది ఉన్నారు. ఇంతవరకు అంతబాగానే ఉన్న బెట్టింగ్‌ అనే భూతం మాత్రం మనుషుల జీవితాలను ఛిద్రం చేస్తుంది. బెట్టింగ్‌ మాయలో పడి చిన్న పెద్ద తేడా లేకుండా తమ జీవితాలను నాశానం చేసుకుంటున్నారు.

ముఖ్యంగా బెట్టింగ్‌కు బలయ్యేది ఎక్కువగా యువకులే. టెక్నాలజీ సరికొత్త పుంతలు తొక్కడంతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు పుట్టుగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. ఒక్క మ్యాచ్ కాకపోతే.. మరో మ్యాచ్ లో అయినా డబ్బులొస్తాయనే ఆశతో అప్పుల మీద అప్పులు చేస్తుంటారు. ఆ తర్వాత అప్పులు ఊబిలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ఇటువంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరుచూ  ఎదోఒక చోట జరుగుతునే ఉంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పదుల సంఖ్యలో బెట్టింగ్‌లు అలవాటు పడి ప్రాణాలను తీసుకుంటున్నారు. మన పక్కరాష్ట్రం తమిళనాడులో కూడా గత మూడేళ్లలో 40 మంది ప్రాణాలను ఈ బెట్టింగ్‌ భూతం మింగేసింది.

ఇది చూస్తే మనం అర్ధం చేసుకోవచ్చు బెట్టింగ్‌ మనుషులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో. ఇక యువకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జూద క్రీడలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా కట్టడి చేయాలి. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలు ఆన్‌లైన్‌ క్రీడలు, బెట్టింగ్‌లను నిషేధించాయి.

బెట్టింగ్ భూతానికి  బలైన యువకుడు..
తాజాగా ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మరో యువకుడు బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా  పాయకరావుపేటకు చెందిన మణికంఠ సాయికుమార్‌ (25) క్రికెట్‌ బెట్టింగ్‌లకు గత కొంత కాలంగా అలవాటు పడ్డాడు. దీంతో బయట అప్పులు చేసి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయి.. అప్పులపాలు అయ్యాడు.

దీంతో బెట్టింగ్ కోసం  చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అంది వచ్చినా కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇది ఒక్క మణికంట కుటంబంలోనే కాదు.. ఈ క్షోభ చాలా మంది కుటుంబాల్లో నెలకొంటోంది.

క్రికెట్‌ను అభిమానించండి తప్పులేదు.. బెట్టింగ్‌లకు మాత్రం అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇకనైన కళ్లు తెరవండి, బెట్టింగ్ మానండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement