శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అమల్లోకి వస్తుందని టీడీపీ దుష్ప్రచారం చేయడం తగదని వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ చట్టం అమలు చేయలేదని, కేంద్ర ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా సూచించిందని, ఆ విషయాన్ని టీడీపీ విష్మరించి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలో గెలిచే సత్తాలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేకమైన ఏ చట్టాన్నయినా వైఎస్సార్ సీపీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమల్లోకి తీసుకురారని, ఇది సామాన్య ప్రజలకు కూడా తెలుసుని పేర్కొన్నారు. రాష్ట్ర స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ వారు సాఫ్ట్వేర్ అప్డేషన్ కోసం సర్క్యులర్ జారీ చేస్తే దాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ఆపాదిస్తూ టీడీపీ సోషల్ మీడియాలో, బహిరంగ సభలు, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి ప్రచారాలను వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి టీడీపీ కూటమిలో ఈ చట్టం దొంగలు ఉన్నారని, అది వారు గుర్తించాలన్నారు. నీతి ఆయోగ్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని, ఆ విషయాన్ని టీడీపీ నాయకులు ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మొట్టమొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం 1989లో ప్రతిపాదన చేయగా, ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నీతిఆయోగ్ ద్వారా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో యాక్ట్ ను అమలు చేయమని ప్రతిపాదించిందన్నారు. అయితే న్యాయవాద సంఘాలనుంచి అభ్యంతరాలు రావడంతో నిలిపివేసినట్లు చెప్పారు.
వైఎస్ఆర్ లీగల్ సెల్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పిట్టా దామోదరరావు