సాక్షి నెట్వర్క్: సూర్యాపేట జిల్లాలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులతో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. సూర్యాపేట పట్టణంలోని ఎంజీరోడ్డు, కొత్తబస్టాండ్ చౌరస్తాతో పాటు పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. నాగారం మండలంలో మామిడి, నిమ్మకాయలు నేలరాలాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాలెంల గ్రామంలోని ఓ ఇంటిపై, జనగాం క్రాస్ రోడ్డు సమీపంలో దుర్గాభవాని హోటల్ వెనుక తాటిచెట్టుపై పిడుగు పడింది. నాగారం మండల కేంద్రం సమీపంలో జీబీకే సిమెంట్ బ్రిక్స్ ఎదురుగా తాటిచెట్టుపై, నాగారం గ్రామ శివారులోని శివాలయం సమీపంలో పిడుగు పడింది. అదేవిధంగా మద్దిరాల మండల పరిధిలోని చందుపట్లలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. అర్వపల్లిలో ఈదురు గాలులకు ఇళ్ల పైకప్పులు, రేకులు, దుకాణాల బోర్డులు లేచిపోయాయి. కాగా కొనుగోలు కేంద్రాల్లో, హైవేలపై పోసిన ధాన్యం తడిసిపోయింది. నేరేడుచర్లలోని జాన్పహాడ్ రోడ్లో చెట్లు విరిగి రోడ్డుపై పడిపోయాయి. తిరుమలగిరిలో విద్యుత్ స్తంభాలు, భారీ వక్షాలు నేలకొరిగాయి.
ఫ ఈదురుగాలులతో కూడిన వర్షం
ఫ నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
ఫ అంధకారంలో పలు గ్రామాలు