త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు!  | Medical Fees Hike Soon | Sakshi
Sakshi News home page

త్వరలో ‘వైద్య’ ఫీజుల పెంపు! 

Published Sat, Jun 24 2023 3:00 AM | Last Updated on Sat, Jun 24 2023 8:50 AM

Medical Fees Hike Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మెడికల్‌ తదితర వైద్య కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల పెంపునకు రంగం సిద్ధమైంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కసరత్తు పూర్తి చేసింది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫీజులను సవరించనుంది.

ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సహా ఇతర కోర్సుల ఫీజులను మూడేళ్లకోసారి సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఏడాదికోసారి 5 శాతం చొప్పున సవరించాలన్న నిర్ణయాన్ని మార్పు చేశారు. ఆ ప్రకారం ఈ సారి తప్పనిసరిగా ఫీజుల సవరణ జరుగుతుందని  హెల్త్‌ వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ప్రైవేటు కాలేజీ ల్లో మెడికల్‌ కోర్సుల ఫీజులు రూ. లక్షల్లో ఉండగా త్వర లో అంతకు మించి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఒక్కో మెడికల్‌ కాలేజీకి ఒక్కో ఫీజు... 
ఇప్పటివరకు రాష్ట్రంలో మెడికల్‌ కోర్సుల ఫీజులు ఒకే రీతిన ఉన్నాయి. ఇకపై ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజు ఉండనుంది. ఆ ప్రకారమే ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ సహా ఇతర వైద్య కోర్సుల ఫీజులుంటాయి. అందుకు అనుగుణంగానే కాలేజీలవారీగా ఆడిట్‌ రిపోర్టులను టీఏఎఫ్‌ఆర్‌సీ తీసుకుంది. వాటి ఆధారంగానే ఫీజుల సవరణ చేయనుంది.

ఇందులో కాలేజీల నిర్వహణ ఖర్చులు మొదలు, బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలు, ల్యాబ్‌ల నిర్వహణ తదితర పూర్తిస్థాయి సమాచారం సేకరించారు. ఈ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఒక రకంగా ఉంటే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీల్లో మరో రకంగా ఉంటాయి.

ఈ దిశగా కాలేజీవారీగా ఆడిట్‌ నివేదికలు పరిశీలించిన టీఏఎఫ్‌ఆర్‌సీ ఫీజుల సవరణపై ఒక అంచనాకు వచ్చింది. కాలేజీలవారీగా ఫీజుల పెంపు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమరి్పంచినట్లు తెలిసింది. దీంతో ఫీజుల పెంపు వ్యవహారంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. 

కొన్ని కాలేజీల్లో 20 శాతం వరకు పెరిగే అవకాశం..
ప్రస్తుతమున్న ఫీజులను కొన్ని కాలేజీలు 20 శాతం వరకు పెంచాలని కోరగా మరికొన్ని 10 శాతం, కొన్ని 5 శాతం, ఇంకొన్ని యథాతథంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. ప్రైవేటు కాలేజీల్లో ప్రస్తుతం ఎంబీబీఎస్‌ సీట్లకు సంబంధించి ఏ–కేటగిరీ (కన్వినర్‌) ఫీజు రూ. 60 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 11.55 లక్షలుగా ఉంది. ఇక సీ–కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) అడ్మిషన్‌ ఫీజు బీ–కేటగిరీకి రెట్టింపు అంటే రూ. 23.10 లక్షల వరకు వసూలు చేసుకొనే వీలుంది.

ఇక పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 7.5 లక్షలు, బీ–కేటగిరీ రూ. 28 లక్షల నుంచి రూ. 30 లక్షల చొప్పున ఉన్నాయి. బీడీఎస్‌ కోర్సులకు సంబంధించి ఏ–కేటగిరీ ఫీజు రూ. 45 వేలు ఉండగా బీ–కేటగిరీ ఫీజు రూ. 4.2 లక్షలు, ఇక సీ–కేటగిరీ ఫీజు బీ–కేటగిరీ కంటే రెట్టింపు వసూలు చేసుకోవచ్చు. వాటితోపాటు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, హోమియోపతి, పారామెడికల్‌ కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా కాలేజీలవారీగా భిన్నంగా ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement