
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాల పర్యటనకు స్వదేశీ దర్శన్ పర్యాటక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డిఫ్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. కోవిడ్ అనంతరం అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ పర్యటనలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారన్నారు. గత ఏప్రిల్లోనే రూ.1.5 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. గతేడాది సుమారు 50 వేల మంది ఐఆర్సీటీసీ ప్యాకేజీలను వినియోగించుకున్నారని, ఈ ఏడాది 70 వేల మందికి పైగా ఐఆర్సీటీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూర్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.
ఐఆర్సీటీసీ టూర్లు ఇవీ...
- తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా ఈ నెల 27న స్వదేశీ దర్శన్ రైలు బయలుదేరనుంది. జూన్ 3వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుంది. ఈ టూర్లో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. అన్ని రకాల సదుపాయాలతో స్లీపర్ క్లాస్ రూ.18,120, ఏసీ క్లాస్ రూ.22,165 చొప్పున ప్యాకేజీ ఉంటుంది.
- మరో ట్రైన్ మహాలయ పిండదాన్– సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15న బయలుదేరి 20న తిరిగి చేరుకుంటుంది. ఈ పర్యటనలో వారణాసి, ప్రయాగ్, గయ, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. స్లీపర్ రూ.14,485, ఏసీ రూ.18,785 చొప్పున చార్జీ ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి.
- షిరిడి సాయి దర్శనానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికి, ఒడిషా జగన్నాధ రథయాత్రకు ప్రత్యేక డొమెస్టిక్ పర్యాటక ప్యాకేజీలను కూడా సిద్ధం చేశారు.
- కేరళ, జమ్ముకాశ్మీర్, అస్సామ్, మేఘాలయ, తదితర ప్రా ంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది.
- అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా రాయల్ నేపాల్ టూర్ ను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 26 నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అన్ని వసతులతో కలిపి రూ.40 వేల వరకు చార్జీ ఉంటుంది.
(చదవండి: మాస్కు మస్ట్... ఆలస్యమైన అనుమతించరు)
Comments
Please login to add a commentAdd a comment