విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను ఎస్పీ ఎం.దీపిక శనివారం సందర్శించారు. అక్కడ ఏర్పాటుచేసిన మూడంచెల భద్రత, గార్డ్స్ పనితీరును తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు, సలహాలిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
రామతీర్థానికి పోటెత్తిన భక్తులు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ మాసం, శనివారం కలిసి రావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలు భక్తులు విచ్చేసి శ్రీరామచంద్రస్వామిని, ఆలయ క్షేత్ర పాలకుడైన ఉమా సదాశివుడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక హోమాలు, సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్మపథం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు కళాకా రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తి భజనలు ఆకట్టుకున్నాయి.
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్టు పరీక్షల విభాగం డీన్ ఆచార్య డి.వి.ఆర్.మూర్తి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. డిగ్రీ ఆరో సెమిస్టర్లో మొత్తం 27,603 మంది పరీక్షకు హాజరవగా 27,483 మంది (99.57 శాతం)ఉత్తీర్ణత సాధించారు. బీఏ(సీబీసీఎస్)లో 99.68, బీబీఏ(సీబీసీఎస్)లో 98.66, బీకాం (కంప్యూటర్స్)లో 99.71, బీకాం(జనరల్)లో 99.92, బీహెచ్ఎంసీటీలో 100, బీఎస్సీలో 99.52, బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీలో 90, బీఎస్సీ ఫుడ్ సైన్స్లో 100, బ్యాచలర్ ఆఫ్ వెటర్నరీలో 100, బ్యాచలర్ ఆఫ్ ఓకేషన్లో 100 మంది ఉత్తీర్ణత సాధించారు.