భువనగిరి క్రైం : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో 10,50 పోలింగ్ కేంద్రాలను ఆదివారం కేంద్ర ఎన్నికల పరిశీలకుడు నవీన్ సైనిక సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఓటర్లు స్వేచ్చాయుత నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో ఆత్మస్థైర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట భువనగిరి రూరల్ ఎస్సై సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్
భువనగిరిటౌన్ : పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం భువనగిరి లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా 1,167 మంది ఉద్యోగులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇంటి వద్ద నుంచి 309 మందికి పైగా వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశారు. భువనగిరిలోని వెన్నెల ఇంజనీరింగ్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతు కే.జెండగే సందర్శించారు. ఓటింగ్ సరళిపై ఆరా తీశారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, సాఫీగా జరగాలని ఎన్నికల అధికారికి చూసించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులంతా ఈ నెల 8 వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
చెక్పోస్టుల్లో తనిఖీలు
చౌటుప్పల్ : మండల పరిధిలో జాతీయ రహదారిపై పంతంగి టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఆదివారం కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు కుమార్ రాజేష్రంజన్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం చౌటుప్పల్ పట్టణంలో ప్రాథమికోన్నత పాఠశాల ఓటర్లతో సమావేశమయ్యారు.ఓటు ఆవశ్యకతను వివరించారు. విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అలాగే తూప్రాన్పేట చెక్పోస్ట్ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే తనిఖీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
యాదాద్రిలో
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రఽభాత సేవ చేపట్టారు. అనంతరం శ్రీస్వామి, అమ్మవారికి ఆరాధన, నిజాభిషేకం, అర్చనలు చేశారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో సువర్ణ అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఉత్సవమూర్తుల జోడు సేవను ఊరేగించారు.