
వెంటిలేటర్పై వైద్య సేవ
పేదలకు ఉచిత వైద్యం అందించే
బృహత్తర పథకం ‘ఎన్టీఆర్ వైద్య సేవ’
(ఆరోగ్య శ్రీ) పథకం పతనం దిశగా సాగుతోంది. ఇప్పటికే ఈ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది తమ ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాట పట్టారు. మూడు దఫాలుగా విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. తాజాగా ఆషా (ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోషియేషన్) రాష్ట్ర కమిటీ వైద్య సేవల నిలుపుదలకు నిర్ణయించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. కూటమి పాలకుల్లో ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’పథకంపై ‘పచ్చ’నీడలు కమ్ముకున్నాయి.
కడప రూరల్: ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం వెంటిలేటర్పై ఉంది. ఈ పథకంలో భాగంగా కార్పొరేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు లభించడమే ప్రధాన ఉద్దేశ్యం.ప్రభుత్వం ఈ నెట్ వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్ బిల్లులు రూ. కోట్లల పేరుకు పోయాయి. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ‘బకాయిలు చెల్లిస్తే గాని తాము కోలుకోలేము..పేదలకు ఉచిత వైద్యంను అందించలేము’అని స్పష్టం చేశాయి.
పేరుకు పోయిన బకాయిలు..
‘ఎన్టీఆర్ వైద్య సేవ’పరిధిలో జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నెట్ వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. అందులో ప్రైవేట్ కార్పొరేట్ (నెట్వర్క్) ఆసుపత్రుల తో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయి.
● ప్రైవేట్ ఆసుపత్రులు వంద పడకలు, 50 పడకలు గల ఆసుపత్రులు ఉన్నాయి. ఒక రోజుకు వేలాది మంది నిరుపేద రోగులు ఉచిత వైద్యం కోసం నెట్ వర్క్ ఆసుపత్రులకు వస్తుంటారు. వారికి వైద్య సేవలు అందించాలంటే ఆసుపత్రుల యాజమాన్యానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం కోట్లల్లో బకా యిలు చెల్లించాల్సి ఉంది. ఒక నెలకే ఒక ఆసుపత్రికి రూ.లక్షల్లో ఖర్చు ఉంటుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలను సక్రమంగా చెల్లించలేదు. విడుదల చేసిన నిధుల కన్నా..ఆసుపత్రుల్లో అందించిన వైద్య సేవలు, అందాల్సిన బిల్లులు అధికంగా ఉన్నాయి. దీంతో నెట్ వర్క్ ఆసుపత్రుల వారు అవకాశం ఉన్న బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్లు, ప్రైవేట్ సంస్థల నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చి ఆసుపత్రులను నిర్వహిస్తున్నట్లు ‘ఆషా’ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● ప్రభుత్వ రంగానికి చెందిన ఆసుపత్రుల్లో ‘వైద్య సేవ’పథకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ డెలివరీలు, పెద్దాసుపత్రుల్లో సాధారణ డెలివరీలతో పాటు సర్జరీలు, అలాగే గర్భాశయం తదితర వ్యాధులకు సంబంధించి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఇందుకు గాను ఒక్కో వ్యాఽధిని బట్టి వైద్య సేవ ట్రస్ట్ నుంచి బిల్లులు మంజూరవుతాయి. ఆ విధంగా వచ్చిన డబ్బును ప్రోత్సాహకం కింద వైద్యులకు 45 శాతం, ఆసుపత్రుల అభివృద్ధికి 55 శాతం కేటాయిస్తారు. అధిక సంఖ్యలో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల ద్వారానే దాదాపుగా 95 రకాల పైగా వ్యాధులకు ఉచిత వైద్య సేవలు లభించడంతో, ఈ ఆసుపత్రులపైనే పెనుభారం పడనుంది.
‘ఆరోగ్య శ్రీ’పై అక్కసు...
2007–2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యంను అందించాలనే సంకల్పంతో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా లక్షలాది మంది పేదలు ఉచిత వైద్యం ద్వారా పునర్జన్మను పొందారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసింది. కాగా టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ‘ఆరోగ్య శ్రీ’పథకం ఒడిడుడుకులను ఎదుర్కొంటుంది. దీంతో ‘ఆరోగ్య శ్రీ’అంటే టీడీపీకి అక్కసు అనే అభిప్రాయం నెలకొంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆసుపత్రులకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలు నిలిపే పరిస్థితులు వచ్చాయి. దీంతో ‘ఎన్టీఆర్ వైద్య సేవ’వెంటిలేటర్పై ఉందనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
పేదలను పట్టించుకోని ప్రభుత్వం
‘వైద్య సేవ’లో పనిచేస్తున్న వైద్య మిత్రలు ఇతర సిబ్బంది తమ ఉద్యోగ భద్రత, సంస్థ మనుగడపై ఆందోళన చేపట్టారు. విడతల వారీగా విధులను బహిష్కరించి, శాంతియుత నిరసన తెలిపారు. నామమాత్రంగా చేపట్టిన విధుల బహిష్కరణకే ఉచిత వైద్యం కోసం వచ్చిన పేదలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా నెట్ వర్క్ ఆసుపత్రుల వారే పూర్తిగా వైద్య సేవల నిలుపుదలకు గట్టిగా నిర్ణయించా రు. ఇంత జరుగుతున్నా పాలకులకు చీమ కుట్టి నట్లైనా లేదు. వైద్య సేవలు నిలిచిపోతే అనారోగ్యం పాలైన రోగులకు ఉచిత వైద్యం అందక, వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవడమే కష్టం.
రూ.కోట్లల్లో పేరుకు పోయిన బకాయిలు
స్పందించని కూటమి పాలకులు
నేటి నుంచి ఉచితవైద్య సేవలు నిలుపుదల
‘ఆషా’రాష్ట్ర కమిటీ నిర్ణయం
పేదల ఉచిత వైద్యంపై పెను ప్రభావం
మాకు సహకరించాలి
నెట్ వర్క్ ఆసుపత్రుల వారికి కోట్లల్లో బిల్లులు అందాలి. ప్రభుత్వం బిల్లులు విడుదల చేస్తేనే ఆసుపత్రులను నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7 నుంచి ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేస్తున్నాం. – డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి,
జిల్లా అధ్యక్షులు, ఏపీ స్పెషాలిటీ హస్పిటల్ అసోషియేషన్
ప్రమాదకర పరిస్థితులు ఉంటాయి
సకాలంలో వైద్యం అందితేనే కోలు కోవడానికి చాలా టైమ్ పడుతుంది. అలాంటిది ఉచిత వైద్య సేవలు నిలిచిపోతే అనర్థాలు జరిగిపోతాయి. అనారోగ్యం పాలైతే లక్షలాది రూపాయలు చెల్లించి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకోలేం. ప్రభుత్వం మా లాంటి పేదలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. –గంగాధర్రెడ్డి, అక్కాయపల్లె, కడప

వెంటిలేటర్పై వైద్య సేవ

వెంటిలేటర్పై వైద్య సేవ

వెంటిలేటర్పై వైద్య సేవ