
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శీలం సూర్య చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం వేకువజాము నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. చంద్రశేఖర్ నివాసాలతో పాటు యనమల కుదురులోని ఆయన సోదరుడు వివేకానంద ఇంటితోపాటు ఇతర బంధువుల, సన్నిహితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, నూజివీడు, హైదరాబాద్, అనంతపురం జిల్లా ఊబిచర్లలో తనిఖీలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 18 చోట్ల, 21 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆస్తులు, బంగారు ఆభరణాలు, నగదు బయటపడుతున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ ప్రస్తుతం రాజమహేంద్రవరంలో విధులు నిర్వహిస్తున్నారు.
రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇళ్లపై సోదాలు అప్ డేట్
- ఏకకాలంలో 18 చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు
- భారీగా బయటపడుతున్న అక్రమ ఆస్తులు
- కాకినాడ కేంద్రంగా ఉన్న ఆర్ జేసీ కార్యాలయాన్ని తనకు అనుకూలంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్న చంద్రశేఖర్ ఆజాద్
- ఏలూరు పత్తేబాద్ సమీపంలో బినామీ పేర్లతో 6 ఎకరాల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు
- విజయవాడ పడమట సమీపంలో విద్యుత్ కాలనీలో కుటుంబ సభ్యుల పేరున కోట్ల రూపాయిల విలువ చేసే అయిదు అంతస్తుల భవనం
- గొల్లపూడిలో కోటిన్నర రూపాయిలతో 500 గజాల స్దలంలో గృహ ప్రవేశానికి సిద్దంగా ఉన్న అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన నూతన భవనం
- అనంతపురం జిల్లా కదిరిలో కుటుంబ సభ్యుల పేరున 32 ఎకరాల స్దలంలో అబేధ్య పేరుతో సోలార్ పవర్ ప్లాంట్..దీనిపై రూ.15 కోట్ల రుణం
- ఇంకా కొనసాగుతున్న ఏసీబీ సోదాలు..