సీఆర్డీఏలో ‘డీపీఎంఎస్’ ఏర్పాటు
ఇకపై ఆన్లైన్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో భవన నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్)ను ప్రవేశపెడుతున్నట్లు సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సత్వర అనుమతుల కోసం ఇప్పటికే ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం, ప్రతి శనివారం ఫెసిలిటేషన్ సెంటర్ నుంచి దరఖాస్తుదారులకు అన్నివిధాల సహకారం అందిస్తున్నట్లే ఈ విధానాన్ని అమలుచేయనున్నట్లు పేర్కొంది. ఈ విధానంలో నివాస, వాణిజ్య, హైరైజ్, గ్రూపు, ప్రత్యేక భవనాలకు సంబంధించి ప్లాన్లకు ఆన్లైన్లో త్వరితగతిన అనుమతిస్తామని తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వినియోగదారుడి సెల్ఫోన్కు ఎస్ఎంఎస్, ఇ–మెయిల్ ద్వారా దాని పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుందని పేర్కొంది. వినియోగదారులు తమ దరఖాస్తు ఏ దశలో ఉన్నదీ సీఆర్డీఏ కార్యాలయానికి రాకుండానే తెలుసుకోవచ్చని, అనుమతి వచ్చిన తర్వాత వెబ్సైట్ నుంచే సంబంధిత ప్లాన్ కాపీలు, సర్టిఫికెట్లు పొందవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫీజులను నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొంది.