
8 ఎకరాల ఆసామి..83 ఎకరాలు కొనడమా? : గౌతంరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూములుకొన్న చలమలశెట్టి నిరంజన్బాబుకు కృష్ణాజిల్లా కలిదిండిలో కేవలం 8 ఎకరాల 69 సెంట్లు భూమి మాత్రమే ఉందని, అలాంటి వ్యక్తి ఒక్కసారిగా 83 ఎకరాలు ఎలా కొన్నారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. సత్రం భూముల కుంభకోణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ విచారణ జరిపించాలని, తాము ఆధారాలతో సహా ఆ కుంభకోణాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన సవాలు విసిరారు.
ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను తాము సేకరించామన్నారు. విదేశాల్లో తమ మిత్రులు పంపిన డబ్బుతో ఈ భూములు కొన్నామని నిరంజన్ తండ్రి రామానుజయ చెబుతున్నారని, అలాంటపుడు ఫెమా చట్టంలోని సెక్షన్ 4ను అనుసరించి చర్యలెందుకు తీసుకోలేదు? ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. బహిరంగ విచారణ నిర్వహిస్తే లోకేశ్కు విదేశాల్లో ఉన్న స్నేహితులె వరో ఆయన బండారం ఏమిటోలో తాము బయట పెడతామని విచారణకు చంద్రబాబుగాని, ఆయన శిష్యులుగాని రావాలని గౌతంరెడ్డి డిమాండ్ చేశారు.