
లండన్: బ్రెగ్జిట్ తర్వాత తీవ్రమైన మానవవనరుల కొరతతో సతమతమవుతున్న బ్రిటన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలుచేస్తున్న వలస విధానం(ఇమిగ్రేషన్ పాలసీ)లో సవరణలను బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటు ముందు ఉంచింది. ఇందులో భాగంగా వ్యాపార సంస్థలు మరింతమంది విదేశీ నిపుణుల్ని నియమించుకునేందుకు వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల భారత్కు చెందిన ఐటీ నిపుణులకు గణనీయమైన లబ్ధి కలగనుంది.
ప్రస్తుతం వేర్వేరు రంగాల్లో ఉద్యోగుల కొరతపై నెలవారీ సమీక్ష నిర్వహించాల్సిందిగా స్వతంత్ర వలసల సలహా కమిటీని కోరతామని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. సృజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు టాలెంట్ వీసాను జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఐరోపాయేతర దేశాల నుంచి బ్రిటన్లో పనిచేయడానికి వచ్చే నర్సులకు ఇస్తున్న టైర్–2 వీసాల గరిష్ట పరిమితిని బ్రిటన్ ఇంతకుముందు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ఆస్పత్రుల్లో వైద్య నిపుణులు, సిబ్బంది కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.