
శబరిమల : సాక్షాత్తు సుప్రీం కోర్టే అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్పు ఇచ్చినప్పటికి భక్తులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. గత నెలలో శబరిమలలో పూజల సందర్భంగా.. నేడు జరిగే ప్రత్యేక పూజల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం మహిళలు వచ్చారు. కానీ 10 - 50 ఏళ్లలోపు బాలికలను, మహిళలను ఆలయంలోకి రాకుండా హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి.
ఈ క్రమంలో నేడు దాదాపు 200 మంది అయ్యప్ప భక్తులు గుంపుగా వెళ్లి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను అడ్డున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఒక అపరాధం చోటు చేసుకుంది. మహిళను అడ్డుకునేందుకు వెళ్లిన సదరు అయ్యప్ప భక్తుల గుంపుకు నాయకత్వం వహిస్తోన్న ఆర్ఎస్ఎస్ నాయకుడు వల్సన్ థిల్లంకెరి ఓ అపచారం చేశారు.
అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే బంగారు మెట్ల మీద వల్సన్ నిల్చున్నాడు. అయ్యప్ప దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా తల మీద ఇరుముడి కెట్టును ధరించాల్సి ఉంటుంది. అలా ఉన్న వారిని మాత్రమే బంగారు మెట్ల మీద నడిచి.. స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు.
కానీ వల్సన్ సాధరణ వ్యక్తిలాగా శబరిమల వచ్చారు. కేవలం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చూడ్డం కోసమే వచ్చిన వల్సన్ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మహిళను అడ్డగించే క్రమంలో ‘ఇరుముడి కెట్టు’ లేకుండానే పవిత్ర బంగారు మెట్ల మీద నిల్చున్నాడు. అయితే మహిళలను అడ్డుకునే విషయంలో అత్యుత్సాహంగా ఉన్న భక్తులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment